కోడ్ ముగిసింది... రోడ్లు మరమత్తుల పనులు షురూ అయ్యేనా...
x

కోడ్ ముగిసింది... రోడ్లు మరమత్తుల పనులు షురూ అయ్యేనా...

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.


రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. సామాన్యులు రోడ్లు బాగు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల ఓ మహిళా నాగోల్ లో రోడ్డుపైనే నీటిగుంతలో కూర్చుని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో అనేకమంది సోషల్ మీడియా వేదికగా రోడ్ల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లు మరమత్తులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రహదారుల మర్మత్తులపై దృష్టి సారించింది.

436 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరమ్మతులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రోడ్ల మరమ్మతులు చేపడతారు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టడానికి టెండర్లను ఖరారు చేయలేకపోయింది.

సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సిఆర్‌ఐఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.850 కోట్లు కేటాయించింది. అయితే గతేడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా పనులు ఖరారు చేసే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కారణంగా అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.

ఎన్నికలు ముగియడంతో రంగంలోకి అధికారులు...

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన టెండర్లు పూర్తయ్యాయని, జూలై మొదటి వారంలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను కోరినట్లు సమాచారం. రాష్ట్ర రహదారుల నిర్వహణ, మరమ్మతు పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రోడ్ల మరమ్మతులకు సీఆర్‌ఐఎఫ్ నిధులను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read More
Next Story