తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ నగరంలోని మూసీ రివర్ ఫ్రంట్ను అంతర్జాతీయ స్థాయిలో సుందరీకరించి అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.(Beautification of Musi)దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఏ దేశంలో పర్యటించినా ఆ దేశ నదీ తీరాల్లో బోటులో విహారం చేసి అక్కడ కల్పించిన సౌకర్యాలు,నదీ తీర ప్రాంతాలను అభివృద్ధి చేసిన తీరును పరిశీలించారు.యూకే దేశం లండన్ లోని థేమ్స్ నదీ నుంచి జపాన్ దేశంలో సుమిదా నది దాకా పలు నదుల్లో సీఎం బోటు షికారు చేశారు. కొరియాలోని చియోంగీచియాన్, దుబాయ్ వాటర్ ఫ్రంట్,సింగపూర్ నదిలో సీఎం బోటులో విహరించారు.
టోక్యో సుమిధ రివర్ ఫ్రంట్ లో సీఎం విహారం
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ను (Tokyo Water Front) శుక్రవారం సందర్శించింది.(CM Japan Tour 2025) టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయడాన్ని సీఎం పరిశీలించారు. సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందీ సీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది.
మూసీ ప్రాజెక్టు కోసం సీఎం అధ్యయనం
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం టోక్యో రివర్ ఫ్రంట్ను క్షుణ్ణంగా పరిశీలించింది.మూసీ నదీ చెంతన పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి బోటులోనూ మూసీలో విహరించి కాలుష్య జలాలను పరిశీలించారు.
మూసీ సుందరీకరణ కోసమే నా తాపత్రయం : సీఎం రేవంత్ రెడ్డి
‘‘ఆహ్లాదమైన… స్వచ్ఛమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుది కీలక పాత్ర. దాని కోసమే నా తాపత్రయం’’ అని సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ట్వీట్ చేశారు.
మినీ సింగపూర్ కావాలి...
కాలుష్య కోరల్లో ఉన్నమూసీ నది పునర్జీవనం అయితే హైదరాబాద్ నగరం కూడా ఒక మినీ సింగపూర్ అవుతుందని సీఎం రేవంత్ గతంతో సింగపూర్ దేశ పర్యటనలో ప్రకటించారు. దేశ,విదేశీ పర్యాటకులతో హైదరాబాద్ నగరం ఒక మహా టూరిస్ట్ విశ్వనగరంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని సీఎం పేర్కొన్నారు. సింగపూర్ నదిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పడవ ప్రయాణం చేశారు.
లండన్ థేమ్స్ నదిపై వంతెనను చూసి...
యూకే దేశ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి థేమ్స్ నదిపై (London Thames River)వంతెనను చూశారు. లండన్ ఛారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించారు.
థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోందని సీఎం గుర్తించారు.
దక్షిణకొరియాలో...
కొరియాలోని చియోంగీచియాన్ అనేది చిన్న పిల్ల కాలువ లాంటిది. అది నది కాదు. దాన్ని చూసొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేస్తాం అని ప్రకటించారు.సౌత్ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చియోంగీచియాన్ నదీ పరిసరాలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి సియోల్లోని నదిని పరిశీలించారు.
దుబాయ్ వాటర్ ఫ్రంట్ సందర్శన
సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్ దేశ పర్యటనలో అక్కడి వాటర్ ఫ్రంట్ ను సందర్శించారు. అధికారులతో కలసి సీఎం దుబాయ్ వాటర్ ఫ్రంట్ అధ్యయన యాత్ర చేశారు.దుబాయ్ వాటర్ ఫ్రంట్ ను వీక్షించేందుకు ఆకాశహర్మ్యాన్ని నిర్మించారు. సీఎం దుబాయ్ టవర్ ను కూడా సందర్శించారు.