
మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి చోటు.. అందరూ తొలిసారి ఎమ్మెల్యేలే..
మంత్రులుగా ప్రమాణం చేసిన వివేక్,అడ్లూరి లక్ష్మణ్కుమార్,వాకిటి శ్రీహరి
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ముగ్గురికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కొత్త మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, శ్రీహరి ముదిరాజ్,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు.
రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుకాంత్ వర్మ కొత్త మంత్రులతో పదవీ ప్రమాణం చేయించారు. సరిగ్గా 12 గంటల 15 నిమిషాలకు ముందుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం వరసగా గడ్డం వివేక్, వాకిటి శ్రీవారి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులు, పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ , పలువురు ప్రముఖులు హాజరయ్యారు.మంత్రి పదవులపై ఆశలు పెట్టుకొని తీవ్ర నిరాశకు గురైన కొందరు సీనియర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి గౌర్హాజరయ్యారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట
ఈ విస్తరణలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ (మాల) వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ (మాదిగ) వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్లకు అవకాశం ఇచ్చారు. దీంతో పాటు శాసనసభ ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) పదవికి ఎస్టీ (లంబాడా) నుంచి రామచంద్రునాయక్ను ఎంపిక చేశారు.ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లతో కాంగ్రెస్ అధిష్ఠానం జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం నిర్ణయాలు తీసుకున్నారు.
మొదట మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీ వర్గాలకే అవకాశం కల్పించారు. మరోవైపు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఆయన సోదరుడు, ప్రస్తుత మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమవుతుందని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు కాబట్టి, ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు జరుగుతోంది. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కొత్త మంత్రుల రాజకీయ ప్రస్థానం:
వివేక్ వెంకటస్వామి
తండ్రి కాకా వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ వెంకటస్వామి అప్పట్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి2014 మధ్య 15వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ను వీడి 2013 లో టీఆర్ఎస్ లో చేరిన వివేక్ అనంతరం తెలంగాణ వచ్చాక 2014లో సొంత పార్టీకి తిరిగి వచ్చారు. 2016లో తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. 2019లో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామిని పార్టీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నది.2023 నవంబర్ 21 న బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి.. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా వున్న ఆయన ప్రస్తుతం రేవంత్ మంత్రి వర్గం లో స్థానం సంపాదించారు.
వాకిటి శ్రీహరి
వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు. 2001 నుండి 2006 వరకు మక్తల్ గ్రామా సర్పంచ్గా,2014 నుండి 2018 వరకు మక్తల్ జెడ్పిటిసి సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2014 నుండి 2018 వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2022 సెప్టెంబర్ 03 నుండి నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా వున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గ కోటాలో మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ...
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు.
త్వరలో మళ్లీ విస్తరణ
తాజా మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ఎదురు చూసిన చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నారు. మంత్రి వర్గంలో ఆరు స్థానాలు ఖాళీ ఉండగా… ప్రస్తుతం ముగ్గురిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మిగిలిన బెర్తుల కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. చాలారోజులుగా కసరత్తు చేస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం ఎట్టకేలకు మూగ్గురితో విస్తరణ పూర్తి చేయగా , మూడు ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.