
తెలంగాణ హెచ్చార్సీ
తెలంగాణలో సుమోటోగా హెచ్చార్సీ కేసుల విచారణ
తెలంగాణలో మానవ హక్కులకు భంగం వాటిల్లినపుడు హెచ్చార్సీ సుమోటోగా కేసుల విచారణ చేపడుతోంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మానవహక్కుల కమిషన్ సక్రమంగా పనిచేయని అధికారులు, ప్రభుత్వ శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కమిషన్ ఏర్పాటైన రెండు నెలల్లోనే 16కు పైగా కేసులను సుమోటోగా విచారణకు స్వీకరించింది. హెచ్చార్సీ విచారణలతో పలు ఘటనలపై ప్రభుత్వ అధికారులు నివేదికలు పంపిస్తున్నారు.
16 నెలలుగా ఖాళీగా ఉన్న మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 18వతేదీన ఏర్పాటైంది. హెచ్చార్సీ కమిషన్ ఛైర్ పర్సన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్, జ్యుడీషియల్ సభ్యురాలిగా ప్రవీణ, నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా బి కిషోర్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హెచ్చార్సీలో 28,500 కేసులు పెండింగులో ఉండటంతో వాటిని పరిష్కరించడంతోపాటు కమిషన్ సుమోటోగా పలు కేసులను స్వీకరిస్తోంది.
విద్యుదాఘాతంతో 69 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుదాఘాతం కారణంగా జరిగిన మరణాల ఘటనలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఈ నెల 17వతేదీన సుమోటోగా విచారణకు స్వీకరించింది.రంగారెడ్డి జిల్లా శంషాబాద్, కొందుర్గ్ మండలాల్లో విద్యుత్ వైర్లు తెగిపడి ప్రజలు మరణించారు. గత ఏడాది 69 మంది కరెంట్ షాక్ తో మరణించారు. లైవ్ విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ ఫార్మర్లకు ఫెన్సింగ్ లేక పోవడం వల్ల తరచూ విద్యుదాఘాతంతో జనం మరణిస్తున్నారని తెలంగాణ హెచ్చార్సీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై నివేదికలను సమర్పించాలని తెలంగాణ ఎస్ పీ డీసీఎల్ సీఎండీ, జిల్లాల కలెక్టర్లను హెచ్చార్సీ ఆదేశించింది.
విద్యుత్ తీగలే యమ పాశాలై...
విద్యుత్ తీగలే యమపాశాలుగా మారి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల సాగర్ రోడ్డు వద్ద 11 కేవీ విద్యుత్ తీగ తెగి పాదచారులపై పడటంతో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్ లో ఓ భవనంపై పనిచేస్తుండగా విద్యుత్ షాక్ కు గురవడంతో అతని రెండు కాళ్లు, చేతులు తొలగించారు. ఎంఎస్ మక్తాకు చెందిన 12 ఏళ్ల బాలుడు నెక్లెస్ రోడ్డు లో క్రికెట్ ఆడుతూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకొని మరణించాడు. ఇంటిపైన దుస్తులు ఆరవేస్తుండగా హైటెన్షన్ వైర్లు తగిలి మహిళ మృతి చెందారు. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం ఏటా రూ. 100కోట్లను ఖర్చు చేస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
విద్యుదాఘాతంతో బాలుడి మరణం
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఢాఖ్యాతండాలో డీజే కు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ తో కేతావత్ అనిరుధ్ అనే అయిదేళ్ల బాలుడు మరణించిన ఘటనను హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చార్సీ నివేదిక కోరింది.
అగ్నిప్రమాద ఘటనపై ఆగ్రహం
గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.భవనం భద్రత, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు పాటించ నందువల్లే అగ్నిప్రమాదం జరిగిందని, దీనిపై జూన్ 30వతేదీలోగా నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్, అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్, టీఎస్ పీఎస్ డీసీఎల్ చీఫ్ ఇంజినీర్లను హెచ్చార్సీ ఆదేశించింది. ఈ ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తల్లిని అడవిలో వదిలేసిన కూతురు
జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన వృద్ధురాలు బుధవ్వను ఆమె కూతురు ఈశ్వరి డబ్బులు, నగలు లాక్కొని అడవిలో వదిలేసింది. ఈ ఘటనను హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
వెలగని వీధిదీపాలపై...
జీహెచ్ఎంసీ పరిధిలో వీధిలైట్లు వెలగడం లేదని, చెత్త సమస్య పరిష్కారం కావడం లేదని వచ్చిన మీడియా కథనాలపై హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది. వీధి లైట్లు వెలగక పోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. నగరంలో 35 శాతం వీధి దీపాలు వెలగడం లేదని, పలు కాలనీల్లో చెత్త సమస్యతో దుర్గంధం వెలువడుతోంది. దీనిపై హెచ్చార్సీ జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది.
అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతోంది...
అన్నం పెట్టమంటే కోడలు చెప్పుతో కొడుతుందని హన్మకొండ జిల్లా పరకాల మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ఊడత సమ్మయ్య, కొమురమ్మ దంపతులు కలెక్టరుకు చేసిన ఫిర్యాదును తెలంగాణ హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. తమకు తిండి పెట్టని వారికి 1.30 ఎకరాల చొప్పున భూమిని పంచానని, తమ ఆస్తిని తమకు చెందేలా చర్యలు తీసుకోవాలని వృద్ధ దంపతులు కోరారు.
గాంధీ ఆసుపత్రిలో దాహం
గాంధీ ఆసుపత్రిలో రోగులు, రోగుల సహాయకులకు మంచినీరు కూడా దొరకడం లేదని విషయాన్ని తెలంగాణ హెచ్చార్సీ సీరియస్ గా తీసుకుంది. వంట గదిలో పురుగులు తిరుగుతున్నాయని, లిఫ్టులు సరిగా పనిచేయడం లేదనే విషయాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించి దీనిపై నివేదికను సమర్పించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రమాదకర రెయిలింగ్
పంజాగుట్ట ద్వారకాపురి కాలనీ రోడ్డు వద్ద ఓ భవనం ముందు రెయిలింగ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రమాదకర రెయిలింగ్ పై జీహెచ్ఎంసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని కమిషన్ ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదికను జూన్ 30వతేదీలోగా సమర్పించాలని హెచ్చార్సీ జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ దుర్గంధంపై...
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఎంఎన్ జే కేన్సర్ ఆసుపత్రి ముందు మ్యాన్ హోల్ నుంచి మురుగునీరు పొంగి పొరలుతుంది. దీంతో ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. అధికారులు మరమ్మతులు చేపట్టక పోవడంతో ప్రజలు దుర్గంధాన్ని భరించలేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించి అధికారులకు నోటీసులు జారీ చేసింది.
కన్నతల్లిని గెంటేసిన కొడుకు
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని మల్లవ్వ నవ మాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసిన తల్లిని ఇద్దరు కొడుకులు స్వామి, మొగిలి గెంటేశారు. తాను సంపాదించిన ఆరు ఎకరాల భూమిని కొడుకులకు పంచి ఇచ్చినా ఇంట్లో నుంచి తనను గెంటేశారని మల్లవ్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
వర్షపునీరు ఇంకని ఇంకుడు గుంతలు
హైదరాబాద్ నగరంలో ఇంకుడు గుంతల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తెలంగాణ హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్షాలు కురుస్తున్నా, వర్షపునీరు ఇంకుడు గుంతల నిర్వహణ సరిగా లేక భూమిలో ఇంకడం లేదని హెచ్చార్సీ పేర్కొంది.హైదరాబాద్ లో 7వేల ఇంకుడు గుంతలున్నా ఇవి మట్టి, రాళ్లు, వ్యర్థాలతో నిండి పోయి వర్షపునీరు సరిగా ఇంకడం లేదని, దీనివల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయని హెచ్చార్సీ తెలిపింది. ఇంకుడు గుంతలకు జియోట్యాగింగ్ చేసి మూడేళ్లకోసారి నిర్వహణ చేయాలని సూచించింది. ఇంకుడు గుంతల్లో వర్షపునీరు ఇంకేలా తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ కోరింది.
ఉక్కపోతతో రోగుల వ్యథపై విచారణ
వేసవికాలంలో ఉక్కపోతతో రోగులు పడుతున్న అవస్థలపై వచ్చిన మీడియా కథనాలపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా, గాంధీ, ఛాతీ, నిలోఫర్, ఎంఎన్ జే ఆసుపత్రుల్లో ఫ్యాన్లు లేక రోగులు ఉక్కపోతతో నానా ఇబ్బందులు పడ్డారు. రోగుల సహాయకుల కేంద్రాల్లోనూ ఫ్యాన్లు లేవు. దీనిపై నివేదిక సమర్పించాలని హెచ్చార్సీ కోరింది.
ట్యాంకులోని నీరు తాగితే అనారోగ్యం...
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో పాత నీళ్ల ట్యాంకులో నీరు తాగితే అనారోగ్యం వాటిల్లుతుంది. నీళ్ల ట్యాంకు పై కప్పు ఊడిపోవడంతో నీళ్లలో పక్షులు, కోతులు, ఇతర జంతువులు పడి మరణిస్తున్నాయి. దీంతో ఆ నీరు కలుషితం అవుతుంది. మరో వైపు ఈ నీళ్ల ట్యాంకు శిథిలమై పెచ్చులూడుతుంది. ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ట్యాంకు కూలితే ప్రాణాపాయం సంభవించే అవకాశముందని హెచ్చార్సీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
దవాఖానాలపై హెచ్చార్సీ విచారణ
తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వెలసిన ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్ లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, నర్సింగ్ హోంలు రోగులను దోచుకుంటూ సరిగా వైద్యం అందించడం లేదని వచ్చిన మీడియా కథనాలపై హెచ్చార్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ వైద్య శాఖ కార్యదర్శిని హెచ్చార్సీ ఆదేశించింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది.
220 మంది విద్యార్థులకు ఒకే మరుగుదొడ్డి
నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 220 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులుండగా వారందరికీ ఒకే మరుగుదొడ్డి ఉంది. అందులోనూ అపరిశుభ్రతతో ఉండటంతో విద్యార్థులు ఒంటికొస్తే ఒకరి తర్వాత ఒకరు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ సమస్యపై జులై 28వతేదీలోగా నివేదిక సమర్పించాలని హెచ్చార్సీ నిజామబాద్ జిల్లా కలెక్టరును ఆదేశించింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ
తెలంగాణ మానవ హక్కుల కమిషనే కాదు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణలోని పలు కేసుల విచారణకు చేపట్టింది. ప్రధాన ఘటనలపై నివేదికలు పంపించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, తెలంగాణ డీజీపీ జితేందర్ లను ఆదేశించింది.
పోలీసు దెబ్బలకు ఆటో డ్రైవరు మృతి
రాజేంద్రనగర్ పోలీసు స్టేషనులో ఆటో డ్రైవర్ ఇర్ఫాన్ మరణించిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇర్ఫాన్ అనే 35 ఏళ్ల ఆటో డ్రైవరుగా బండ్లగూడ జాగీర్ ఖలీజ్ ఖాన్ ప్రాంతంలో నివాసం ఉండగా, అతను పొరుగింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. పోలీసులు అతన్ని స్టేషనుకు తీసుకువచ్చారు. పోలీసుస్టేషను ఆవరణలోనే ఆటో డ్రైవరు కుప్పకూలి మరణించారు. పోలీసు దెబ్బలకు ఇర్ఫాన్ మరణించాడని మృతుడి సోదరుడు ఆరోపించారు. మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించి, వారం రోజుల లోగా నివేదిక సమర్పించాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో పేలుడుపై విచారణ
యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి గ్రామంలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలోని ప్రొపెల్లెంట్ మిక్సింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడినట్లు వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ ఏడాది ఏప్రిల్ 29వతేదీన జరిగిన ఘటనపై రెండు వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
లగచర్లపై విచారణ
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తమ అధికారుల బృందాన్ని లగచర్లకు పంపించాలని కూడా ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
గోదావరిలో భద్రతా చర్యలేవి?
నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన అయిదుగురు భక్తులు నీటిలో మునిగి మరణించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని, పుష్కర ఘాట్లలో సూచిక బోర్డులు లేవని, గజ ఈతగాళ్ల జాడ లేదని, నది లోపలకు భక్తులు వెళ్లకుండా నివారించేందుకు భద్రతా చర్యలు ఏర్పాటు చేయలేదని. ఘాట్ వద్ద నదిలో లోతుకు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేయలేదని న్యాయవాది హెచ్చార్సీలో పిటిషన్ దాఖలు చేయడంతో కేసు నమోదు చేసింది.
Next Story