తెలంగాణలో నాలుగో ఫ్యూచర్ సిటీ...
x

తెలంగాణలో నాలుగో ఫ్యూచర్ సిటీ...

రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. అందులో భాగంగా ఆదివారం అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు.

“తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుంది. గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను” అని సీఎం రేవంత్ ఎన్నారైలకు గుర్తు చేశారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని రేవంత్ తెలిపారు.

తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.

‘ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది.. గిట్టని వాళ్లందరూ అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదని అన్నారు. వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మందగిస్తుందంటూ లేని పోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పు అని మరోసారి నిరూపిస్తాం. హైదరాబాద్‌ ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతాం...’ అని సీఎం వెల్లడించారు.

మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో నాలుగో ఫ్యూచర్ సిటీ...

ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు మీరందరూ కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలన్న మా కోరిక నెరవేరింది. ఇప్పుడు రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేయడానికి మనమందరం కష్టపడాలి...’ అన్నారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, వ్యాక్సిన్‌లు, హెల్త్‌కేర్‌, ఆర్టిఫిషియల్ రంగాల్లో తెలంగాణ బలమైన స్థావరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని సీఎం కి ఎన్నారైలు హామీ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పాటలు, నృత్యాలతో కూడిన భారీ ప్రదర్శనను చిన్నారులతో ఏర్పాటు చేశారు.

Read More
Next Story