
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12 బృందాలతో సహాయ చర్యలు
ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాద ప్రదేశంలో సహాయ చర్యలను వేగవంతం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో గల్లంతైన వారికోసం గాలిస్తున్నామని కమిషనర్ అర్వింద్ కుమార్ చెప్పారు.
ఎస్ ఎల్ బి సి టన్నెల్ లో శుక్రవారం కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జేపీ బేస్ క్యాంప్ ఆఫీస్ లో సహాయక బృందాల అధికారులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ,ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారి సుఖేండు,టిఎస్ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్ ఆలీ,ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్ కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
12 బృందాలతో సహాయ చర్యలు
ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు.సహాయ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని వాటిలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు వివరించారు.
పక్కా ప్రణాళికతో సహాయ చర్యలు ముమ్మరం
ప్రమాద ప్రదేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసేలా సహాయక బృందాలను నిరంతరం పనిచేసేలా పక్కా ప్రణాళికతో సహాయక చర్యలకు కావాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటికి తరలిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విపత్తు శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ శుక్రవారం రాత్రి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు ఆయన వివరించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12 బృందాలతో సహాయ చర్యలు
వీలైనంత త్వరగా కన్వేయర్ బెల్ట్ ను ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు, బురదను తీసి వేసేందుకు కావాల్సిన ఎస్కావేటర్లను సిద్ధం చేసినట్లు అర్వింద్ కుమార్ వివరించారు. ప్రత్యేక కెమేరాలు, సెన్సార్ల ద్వారా లోపలి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంపై వైరల్ అవుతున్న సమాచారం తప్పుడు సమాచారం అని తెలంగాణ విపత్తు శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు.
Next Story