పోలీసులే దాడి చేయించారు -కేటీఆర్
x

పోలీసులే దాడి చేయించారు -కేటీఆర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.


బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం ఆయన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. కౌశిక్ రెడ్డిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ అక్కడే మీడియాతో మాట్లాడారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసాడు రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపూడి గాంధీని PAC చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదన్నారు.

రేవంత్ పైశాచిక ఆనందం కోసం...

"ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి, కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు. పది మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైంది. ఫిరాయింపులపై స్పీకర్‌ను కలిసి సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేశాము. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చెప్పాలి, ఏ పార్టీలో ఉన్నారో. కాంగ్రెస్‌లో ఎందుకు చేరావు? దిక్కుమాలిన PAC పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గు ఉండాలి. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారు. గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారు. నీవంటి పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశాం. పైశాచిక ఆనందం కోసం ఇదంతా రేవంత్ చేస్తున్నాడు. ఇవన్నీ తిరిగి రేవంత్‌కు తిరిగి చుట్టుకుంటాయి" అని కేటీఆర్ అన్నారు.

పోలీసులను సస్పెండ్ చేయండి...

దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని కేటీఆర్ డిమాండ్ చేశారు. మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, అర్థరాత్రి వరకు తిప్పితే, తెలంగాణ ప్రజలు మొత్తం మా వెంట నిలిచారన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారన్నారు. నిన్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి, గాంధీకి రక్షణ కల్పించారు... గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా నిర్వహించాం, ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ మా వారే అని కేటీఆర్ అన్నారు. ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు, ఇప్పుడు ఉండవు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.

Read More
Next Story