బండి సంజయ్‌.. చిల్లరమాటలు మానుకోవాలి: సీతక్క
x

బండి సంజయ్‌.. చిల్లరమాటలు మానుకోవాలి: సీతక్క

బండి సంజయ్.. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదని సీతక్క మండిపడ్డారు.


‘బీజేపీది భారత్ టీం అని.. కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం’ అంటూ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి సీతక్క ఖండించారు. బీజేపీ ఎంతో అభివృద్ధి చేసింది అని అంటున్నారు తప్పితే ఏం చేసిందో చెప్పుకోవడానికి బీజేపీ నేతలకే దిక్కు తోచడం లేదంటూ చురకలంటించారు. బీజేపీకి మోసాలు చేయడం, మతరాజకీయాలు చేయడం తప్ప ఏమొచ్చంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను తెగనమ్మారని విమర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పటి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.

‘‘గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులకు యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నారు. చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు. అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదు. సూటిగా బండి సంజయ్‌ని అడుగుతున్నా. పట్టభద్రులకు మీరేం చేశారు’’ అని నిలదీశారు.

‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు బీజేపీకి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మారు. ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు. దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. దేవునికి వినియోగించే అగర్బత్తుల మీద కూడా జీఎస్‌టీ వేసింది. ఉన్నత విద్య మీద 18% జీఎస్‌టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. అలాంటి బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలంగాణ విభజన హామీలు అమలు కాలేదు. ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘బండి సంజయ్..పాకిస్తాన్‌తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు. పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని కించపరచడం తప్ప మీరు దేశానికి చేసింది లేదు. దమ్ముంటే అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికల్లోకి రండి. ట్రైబల్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేనీ అసమర్థ కేంద్ర ప్రభుత్వం మీది. బండి సంజయ్‌కి చెప్పుకోవడానికి ఏం లేదు.. మాట్లాడడానికి రెండు మాటలు లేవు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే.. భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్ధంలో పాల్గొనండి. ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన పాకిస్తాన్‌తో పోల్చి దేశాన్ని అవమానపర్చకండి బండి సంజయ్’’ అని సూచించారు.

‘‘పాకిస్తాన్‌తో భారతదేశాన్ని పోల్చి దేశ ఔన్నత్యాన్ని బండి సంజయ్ తగ్గిస్తున్నారు. దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్‌ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతానని చెప్పిన మీరు.. అధికారం కోసం విద్వేష ప్రసంగాల అవసరమా. పుట్ట భద్రులారా ఆలోచించండి. విద్యా వేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి. సంవత్సరకాలంలో 54 వేల ఉద్యోగాలు ఇచ్చాం. నరేందర్ రెడ్డిని గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. భావోద్వేగాలతో రాజకీయాలు చేసే బండి సంజయ్‌కి, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి’’ అని పిలుపునిచ్చారు.

‘‘యువతనీ మత కొట్లాట వైపు మళ్లించి కేసులు నమోదు చేయించడమే బీజేపీ రాజకీయం. బీఆర్ఎస్, బీజేపీ రెండూ పార్టీలే దొందూ దొందే. జఠిలమైనా ఎన్నో సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. భారతదేశంలో యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం మానుకోవాలి. ఈ చిల్లర మాటలు మానేయండి. ఇలాంటి విద్వేషాలు పూరిత ప్రసంగాలు భారతీయుల ఐక్యతను దెబ్బతీస్తుంది. అన్ని రంగాల వెనుకబడ్డ పాకిస్తాన్తో భారతదేశం ని పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో మనం పోల్చుకోవాలి’’ అని అన్నారు.

Read More
Next Story