‘హరీష్ చెప్పేవన్నీ సొల్లు మాటలే’
x

‘హరీష్ చెప్పేవన్నీ సొల్లు మాటలే’

పరామర్శించాలి, పరిస్థితులను పరిశీలించాలి అనుకునేవారు ఎవరైనా వంద వాహనాల్లో వస్తారా?’’ అని ప్రశ్నించారు జూపల్లి.


తన రాజకీయ మైలేజీ కోసం హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ఎల్ఎల్‌బీసీ ప్రమాదాన్ని పావుగా వాడుకుంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పదేళ్ల పాలించిన బీఆర్ఎస్.. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. చేతకాలేదా? చేయదలుచుకులేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టిందని, అలా కాకుండా.. ప్రాజెక్ట్‌ను ఎందుకు ఒక్కసారిగా అటకెక్కించారో చెప్పాలని అన్నారు జూపల్లి. గత ప్రభుత్వం చేతకానితనం, వైఫల్యాల వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. 2014 నుంచి 2023 వరకు 20 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేసినట్లు హరీష్ రావు చెప్తున్నారని, పదేళ్లలో మిగిలిన 19 కిలోమీటర్లు ఎందుకు పూర్తి చేయలేదని, తవ్వడం చేతకాలేదా? అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు వచ్చి హరీష్ రావు.. సొల్లు పురాణం మాటలు మస్త్‌గా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అడిగిన ప్రశ్న తప్ప మిగిలిన అన్ని అంశాలపై ఆయన మాట్లాడుతున్నారని చురకలంటించారు.

ఎస్ఎల్‌బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి బాగోగులపై అంత ఆందోళనే ఉంటే.. ప్రమాదం జరిగిన తర్వాత రోజే అక్కడకు ఎందుకు రాలేదు హరీష్? ఐదు రోజులు ఆగి ఆరో రోజున అక్కడకు వచ్చి గలాటా సృష్టించాలని ప్రయత్నించడం ఏంది? అని ప్రశ్నించారు. ‘‘ వంద బండ్లు వేసుకుని ఏదో యుద్ధానికి వెళ్తున్న తరహాలో ఎస్ఎల్‌బీసీ దగ్గరకు వచ్చారు హరీష్. అడిగిన ప్రశ్నను విడిచి అన్నింటిపై స్పందిస్తారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లోకి నేనొక్కడినే వెళ్లాను. టన్నెల్‌లోకి నీళ్లు, బురద వచ్చి అంతా బూగిసిపోయింది. అది తీస్తే మళ్ళీ వరద వస్తుంది కదా. ఎనిమిది మందిని కాపాడటం కోసం వందమంది లోపలికి వెళ్లారు. అలాంటప్పుడు నీళ్లు, బురద వస్తే అది ఇంకో ప్రమాదంగా మారుతుంది. సహాయక చర్యలంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నిపుణులు చెప్పినట్లు చర్యలను ముందుకు కొనసాగిస్తున్నాం. జిల్లా మంత్రిగా టన్నెల్‌లోకి నేనే వెళ్లా. తమను రానివ్వలేదంటూ కొందరు డ్రామాలు ఆడుతున్నారు. అసలు వారిని ఎస్ఎల్‌బీసీ దగ్గరకు రావడానికి అనుమతి ఇచ్చిందే మేము. కానీ వాళ్లు మాత్రం రాజకీయ లబ్దికోసం డ్రామా చేస్తున్నారు. పరామర్శించాలి, పరిస్థితులను పరిశీలించాలి అనుకునేవారు ఎవరైనా వంద వాహనాల్లో వస్తారా?’’ అని అన్నారు జూపల్లి.

‘‘ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను 20 కిలోమీటర్లు తవ్వి ఆ తర్వాత ఎందుకు ఆపేశారు? తక్కువ లాభం వస్తుందనా? టన్నెల్ నిర్మాణం పూర్తియితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందా? ఇవి నేను హరీష్‌ను అడుగుతున్న మూడు ప్రశ్నలు. వీటికి ఆయన సమాధానం చెప్పాలి. ప్రకృతి విపత్తులను బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌ను బీఆర్ఎస్ ఎందుకు పెండింగ్‌లో పెట్టింది? ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలు ఎవరికీ లేదు. అద్భుతం జరిగితే తప్ప ప్రమాదంలో చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదు. ప్రమాద సమయంలో పనులు చేస్తున్న సంస్థ అప్రమత్తంగా లేకుండా ఉండి ఉంటే.. బాధితుల సంఖ్య 40 వరకు ఉండి ఉండేది’’అని పేర్కొన్నారు మంత్రి జూపల్లి.

Read More
Next Story