హైదరాబాద్‌లో కదులుతున్న కారులో నిర్భయ ఘటన
x

హైదరాబాద్‌లో కదులుతున్న కారులో నిర్భయ ఘటన

హైదరాబాద్ లో మరో నిర్భయ ఘటన కలవరం రేపుతోంది.


హైదరాబాద్ లో మరో నిర్భయ ఘటన కలవరం రేపుతోంది. కదులుతున్న కారులో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. తనపై జరుగుతోన్న గృహహింస గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మహిళ మరో కేసులో బాధితురాలయ్యింది. తన నిస్సహాయతను ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్ అండ్ బ్యాచ్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ళ మహిళ తనపై జరుగుతోన్న గృహహింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఈ నెల 12 (మంగళవారం) రాత్రి యాప్రాల్ నుంచి ఉబర్ ఆటో (AP 11TA 0266) బుక్ చేసుకుని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. స్టేషన్ లో ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు అదే ఆటోలో బయలుదేరింది.

ఆమె నిస్సహాయతను గ్రహించిన ఆటో డ్రైవర్, ఎస్ శంకర్ తన ఇద్దరు స్నేహితులకు విషయం చెప్పాడు. అమానుష్య ప్రాంతానికి వెళ్లిన తర్వాత ఆమెని తన స్నేహితులతో కలిసి ఆమెని బెదిరించి కారులో ఎక్కించారు. తర్వాత శంకర్ వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు వ్యక్తులు తెల్లవారుజామున 2:45 గంటల వరకు సిటీ అంతా తిప్పుతూ కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారం చేశారు. వారి నుండి తప్పించుకున్న బాధితురాలు రోడ్డుపైకి వచ్చి కాపాడమంటూ కేకలు వేసింది. ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ ఆమెకి సాయం చేశాడు. అతని వాహనంలో సమీపంలోని వినాయకుడి గుడి వద్దకి చేరుకుంది.

అక్కడ స్థానికుల సాయం తీసుకుని డయల్ 100 కి ఫోన్ చేసి తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పింది. దీంతో బొల్లారం పోలీసులు వెంటనే ఆమె ఉన్నచోటుకి వెళ్లారు. ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. అనంతరం కేసుని అల్వాల్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. పోలీసులు ఇప్పటి వరకు ఆటో డ్రైవర్‌ శంకర్ ని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడలేదు.

Read More
Next Story