తెలంగాణలో రాజుకున్న గ్రూప్ -1 మెయిన్స్ వివాదం
x

తెలంగాణలో రాజుకున్న గ్రూప్ -1 మెయిన్స్ వివాదం

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వ్యవహారంపై వివాదం రాజుకుంది.వాయిదా వేయాలని అభ్యర్థులుకోరుతుండగా, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శాంతి కుమారి స్పష్టం చేశారు.


తెలంగాణలో ఈ నెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే హాల్ టికెట్లను సైతం టీఎస్ పీఎస్సీ జారీ చేసింది. గ్రూప్ -1 పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతున్నారు.

- రెండు రోజులుగా అభ్యర్థులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు దొర్లినందు వల్ల జీఓ 29 సవరణ తర్వాతే మెయిన్స్ పరీక్షలు జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ పరీక్షలపై 33 కేసులు కోర్టులో ఉన్నాయని, ఇవి పరిష్కారమైన తర్వాత పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి కోరారు. మొత్తం మీద గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై వివాదం రాజుకుంది.



పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం : చీఫ్ సెక్రటరీ

ఈనెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సమీక్షలో తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుంచి కమిషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. సచివాలయం నుంచి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు.

46 పరీక్షా కేంద్రాలు
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు.

పుకార్లకు తావివ్వవద్దు...
2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి సూచించారు. గ్రూప్ -1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.

సీసీటీవీలతో నిఘా
టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

బయోమెట్రిక్ హాజరు
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు.దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు.అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని ఎండీ ముషారఫ్ అలీ చెప్పారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Read More
Next Story