
‘నక్సలిజం రంగు మార్చుకుంటున్నది....జాగ్రత్త’
అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ (MMRI) ఆధ్వర్యంలో ‘నక్సలిజం రంగులు మార్చడంపై ఓయూ ఆడిటోరియంలో శనివారం జరిగిన సెమినార్’ లో పలువురు మేధావులు ప్రసంగించారు.
భారత దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత హింసావాదానికి తావులేదని మాజీ ఐఎఎస్ అధికారి లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.అయితే, యువకులకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని అలా కాని పక్షంలో వాళ్ల గుండెల్లో కసి రగులుతూ ఉంటుందన్న విషయం విస్మరించరాదని కూడా ఆయన అన్నారు. అమరవీరుల స్మారక పరిశోధన సంస్థ (MMRI) ఆధ్వర్యంలో ‘ మారుతున్న నక్సలిజం రంగు' (Changing Colours of Naxalism) అనే అంశం పై ఉస్మానియా యూనివర్శిటీ ఆడిటోరియంలో శనివారం జరిగిన సెమినార్’ లో జయప్రకాశ్ నారాయణ్ అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎమ్ ఎమ్ ఆర్ ఐ అనేది రాష్ట్రీయ స్వయం సేవకర్ సంఘ్ (RSS) సీనియర్ నేతలు 1991లో ఏర్పాటు చేసిన సంస్థ. నక్సలైట్ చేతిలోచనిపోయిన వారిని స్మరించుకుంటూ దేశ సమైక్యత సమగ్రత కోసం పాటుపడటం తన ఉద్దేశంగా ఈ సంస్థ ప్రకటించుకుంది. నక్సలిజం అనేది ఇపుడు రంగు మార్చుకుందని, ఇపుడది యూనివర్శిటీలలో,మీడియాలో, స్వచ్ఛంద సంస్థలలో, న్యాయ పోరాటాలలో ‘అర్బన్ నక్సలైట్స్’గా ఉనికిని మార్చుకుందని ఈ సంస్థ అభిప్రాయపడుతున్నది. కేవలం తుపాకి గొట్టం మీద అధారపడకుండా, సోషల్ మీడియా ప్లాట్ ఫారాల నుంచి సైబర్ ప్రాపగాండ బోగస్ కథనాలు సృష్టించి తద్వార యువకులను ఉత్తేజపరిచి నక్సలిజం వైపు మళ్లించేందుకు అర్బన్ నక్సలైట్లు పనిచేస్తున్నారని అంటూ వారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం అవసరమని ఎం ఎం ఆర్ ఐ భావిస్తున్నది. మేధావులు, మానవ హక్కుల ఉద్యమకారుల పేరుతో చలామణి అవుతున్న ఈ అర్బన్ నక్సల్స్ ను ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సవాల్ మారిందని ఎంఎంఆర్ చెబుతున్నది. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని రూపమాపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్నప్రయత్నాలకు ఊతంగా ఎంఎంఆర్ఐ నేడు హైదరాబాద్ లో ఈ ‘మారుతున్న నక్సలిజం రంగు’ సెమినార్ ని ఏర్పాటు చేసింది.
అపార వైవిధ్యం ఉన్న భారతదేశంలో ఐక్యత లేకుండా శాంతిభద్రతల పరిరక్షణ, స్వేచ్ఛ సాధ్యమవుతుందా అని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. సమానత్వం, సోషలిజం, వామపక్షభావాలతో మనమంతా ప్రభావితమైన వారమే నంటూ దేశ సార్వ భౌమత్వానికి, సమాజ సుస్ధిరతకు భంగం వాటిల్లినపుడు చట్టపరిధిలో పనిచేయాలన్నారు. యుగోస్లోవియా, సోవియెట్ యూనియన్ దేశాల్లో జరిగిన అనైక్యత ఆ దేశాలను విచ్ఛిన్నం చేసిందని జేపీ చెప్పారు.
ఈ గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికీ 35 శాతం మంది పట్టణాల్లో ఉన్నారని, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్నారు. నిరుపేదలు పొట్ట చేతబట్టుకొని నగరానికి వలస వచ్చారని ఆయన చెప్పారు. ఒక్క రోజు పనిలేక పోయినా, జబ్బు చేసినా పస్తులుండాల్సిన దుస్థితి ఇప్పటికీ కార్మికుల్లో ఉందన్నారు. నూతన సాంకేతికతతో అవకాశాలు పెరిగాయన్నారు ఈ పరిస్థితులనుంచి బయటపడాలని ఆయన చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో ఏడేళ్లపాటు పనిచేశా...
నాగాలాండ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఛైర్మన్ , మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ నక్సలిజంలో హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అని ఉన్నారని, సాఫ్ట్ వేర్ వారే అర్బన్ నక్సలైట్లు అని చెప్పారు. తీవ్రవాద టెండెన్సీని రూపుమాపాలని సూచిస్తూ కళాశాలల్లో లెఫ్ట్ వింగ్ అధ్యాపకులున్నారని, వారే నక్సలిజం మాటలు రంగులు మార్చుకున్నారని చెప్పారు.
ఎస్ ఆర్ శంకరన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నపుడు ఆయవ వద్దకు వెళ్లినపుడు గిరిజన ప్రాంతాల్లో ఎవరు పనిచేస్తారని అడిగితే తానే చేయి ఎత్తానని మరునాడే ఆసిఫాబాద్ సబ్ కలెక్టరుగా, ఉట్నూరు, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశానని ఆయన చెప్పారు. తాను ఏడేళ్ల పాటు గిరిజన ప్రాంతాల్లో పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.
నక్సలైట్లను, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిని, సాయుధ దళాలను గుర్తు పెట్టుకుంటున్నామని , కానీ వీరి మధ్య నలిగిన గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
ఏ గిరిజనుడు కూడా చేయి చాపి యాచించరని చెప్పారు. ఇన్ ఫార్మర్ల నెపంతో ఎందరో గిరిజనులను నక్సలైట్లు కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. తాను కరీంనగర్ లో పనిచేసినపుడు వెంకట్రావు అనే ఎమ్మెల్యే ప్రజలకు దగ్గరగా ఉన్నారని, అతన్ని కాల్చిచంపారని ఆరోపించారు. ప్రజలకు దగ్గరగా ఉండే శ్రీపాదరావును కూడా నక్సలైట్లు కాల్చి చంపారని చెప్పారు. నక్సలైట్లు ఆపరేట్ చేసే ప్రాంతాల్లో తిరుగుతున్నారని ప్రజలకు దగ్గరయ్యే నేతలను వారు చంపారని చెప్పారు.
మూడు సార్లు కిడ్నాప్ నకు గురయ్యా...
తాను మూడు సార్లు కిడ్నాప్ కు గురయ్యానన్నారు. పెద్దపల్లి ప్రాంతంలో ఆదివారం రోజు మారుమూల గిరిజన ప్రాంతానికి వెళితే నక్సలైట్లు తమను కాల్చి చంపాలని చూశారన్నారు. తనను చంపేందుకు నక్సలైట్లు సమాయత్తం అయితే గిరిజనులు వచ్చి అడ్డుపడ్డారని, ముందుగా తమను కాల్చిన తర్వాతే ఆయన్ని చంపాలని కోరారని చెప్పారు. ఆ రోజు పెద్దపల్లి వాసి బోడిగుండ సత్తయ్య దళ కమాండరుగా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత లొంగిపోయి జైలులో ఉంటే తాను అతన్ని వెళ్లి పరామర్శించి వచ్చానన్నారు.దారి తప్పిన యువతను దారిలో పెట్టాలని,వారిని ఆదరించాలని దాసరి శ్రీనివాసులు సూచించారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు సాగాయన్నారు. మూడు తరాలుగా తాము సాగుచేస్తున్న భూములను జంగ్లాత్ వాళ్లు లాగేసుకున్నారని బీర్ సాయిపేట గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమాలు బాగా పనిచేస్తున్నాయని దాసరి శ్రీనివాసులు అభినందించారు.
తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాన్ని స్థాపించలేరు...
తుపాకీ గొట్టం ద్వారా తాము రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పడం సరైంది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదశ్ మాజీ డీజీపీ, ఐపీఎస్ కె అరవింద్ రావు చెప్పారు చెప్పారు. అంబుజ్ మడ్ దట్టమైన అడవి అని, అక్కడ మావోయిస్టులు కేంద్రంగా చేసుకొని పాగా వేశారని హింసాకాండకు పాల్పడుతున్నారని చెబుతూ మావోయిస్టుల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని, ఇది దేశ అంతర్గత సమస్య అని అంటూ తాము అనేక నివేదికలు పంపించి కేంద్రాన్ని ఈవిషయంలో ఒప్పించగలిగామని చెప్పారు.
1967వ సంవత్సరంలో చారుమజుందార్ ఉద్యమం వచ్చినపుడు కొద్ది మంది భూస్వాముల చేతుల్లో భూములుండేవని, కానీ 1970 వ సంవత్సరం తర్వాత ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చాక భూస్వాములు లేరని అరవింద్ రావు చెప్పారు.అర్బన్ నక్సలైట్లు అనే భావన పాతదని చెప్పారు. భారతదేశం దేశమే కాదని, 56 దేశాల సమూహమని మావోయిస్టులు ఎత్తుగడ వేశారని ఆయన పేర్కొన్నారు.

మారుతున్న నక్సలిజం రంగులు చూశాను...
1980వ సంవత్సరం నుంచి నక్సలిజం రంగులు మార్చుకుంటున్న వైనవ చూశానని బిజెపి సీనియర్ నాయకుడు, నెహ్రూ యువకేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పేరాల శేఖర్ రావు చెప్పారు. 1967 నుంచి 1969 మధ్య నక్సల్బరీ శ్రీకాకుళం ప్రాంతంలో ప్రారంభం అయిన నక్సలిజం ఇపుడు రూపు మార్చుకుని అర్బన్ నక్సలిజం అవతారమెత్తిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మనకు ఇష్టమైన వారిని ఎన్నుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందని, దానికి విరుద్ధంగా ఆయుధ తిరుగుబాటు ద్వారా నక్సలిజం వ్యవస్థ తీసుకువస్తామని నక్సలైట్లు ప్రకటిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. నేపాల్ దేశంలో, మిజోరంలో నక్సైలైట్లు, మిజో ఉగ్రవాదులు మారారని, కాని మన మావోయిస్టులు మాత్రం మారడం లేదన్నారు.
సాయుధ పోరాటం ద్వారా దేశాన్ని వారి గుప్పిట్లోకి తీసుకురావాలని యత్నిస్తున్నారని దీనికోసం వారు ఎన్నికల వ్యవస్థలోకి బహిష్కరిస్తున్నారని చెప్పారు.
వామపక్ష భావాలున్న మేధావులు హరగోపాల్, ఆకునూరి మురళి, కోదండరాంలు సాయుధ ఉద్యమం సరైనది కాదని చెప్పాలని శేఖర్ రావు సూచించారు. వరంగల్, కరీంనగర్, పరకాల, హుజురాబాద్ ప్రాంతాల్లో విప్లవం వచ్చిందని నక్సలైట్లు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. తాము ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేశామని చెప్పారు. సాయుధ పోరాటం, హింసాత్మక విధానం సరైంది కాదని, ఎర్రజెండాలు పాతి భూములను కబ్జా చేసుకోవడం సరైంది కాదని తాము ప్రజల్లో ప్రచారం చేశామని ఆయన పేర్కొన్నారు. హింసాత్మక మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా తాము ఏభీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. సైద్ధాంతిక యుద్ధం నడుస్తుందని, జరుగుతున్న పరిణామాలను మనం గ్రహించాలని అఖిల భారత సంయోజక సామాజిక సమరస్తా మంచ్ కు చెందిన కె శ్యామ్ ప్రసాద్ కోరారు. మనం మంచి పనులు చేస్తూనే ఉంటే విజయం తథ్యం అని ఆయన చెప్పారు.