పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్  కన్నుమూత
x

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

తెలంగాణ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. డీఎస్ నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.


తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ,మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీ శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.

- డీఎస్ గా పేరొందిన డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా,ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.


అంచెలంచెలుగా ఎదిగి...
డి శ్రీనివాస్ చదువు పూర్తయ్యాక కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ 1948 సెప్టెంబరు 27వతేదీన జన్మించారు.హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదివిన తర్వాత 1989వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎస్ 2009లో సీఎం రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర ఉన్నతవిద్య,ఇంటరు విద్యా శాఖల మంత్రిగా పనిచేశారు.

పీసీసీ అధ్యక్షుడిగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. 2016 జూన్ 22 నుంచి 2022 జులై 4వతేదీ వరకు ఈయన బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2014 జూన్ 3 నుంచి 2015 జులై 2వతేదీ వరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.2004,2009 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో రాజశేఖర్ రెడ్డితో కలిసి డీఎస్ కీలక పాత్ర పోషించారు. డీఎస్ 2009, 2010 ఉప ఎన్నిక, 2012, 2014లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

బీఆర్ఎస్ చేరిన డీఎస్
కాంగ్రెస్ పార్టీలో ఉండగా తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2015వ సంవత్సరం జులై 2వతేదీన డీఎస్ 2015వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా డీఎష్ ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన డీఎస్ కు కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. తెలంగాణలో మళ్లీ 2023 మార్చి 26వతేదీన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చివరి దశలో సొంత గూటికి వచ్చిన డీఎస్
కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ 2023 మార్చి 26వతేదీన తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ తో కలిసి వీల్‌చైర్‌లో గాంధీభవన్‌ కు వచ్చిన డీఎస్ కాంగ్రెస్ తీర్థం స్వీకరించారు. కాంగ్రెస్‌ లో తిరిగి చేరడం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని డీఎస్ గతంలో వ్యాఖ్యానించారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌ తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.


Read More
Next Story