పాశమైలారం సిగాచి కెమికల్ పరిశ్రమలో సోమవారం జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంతటి ఘోర ప్రమాదం జరిగిన వెంటనే సంగారెడ్డి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, పోలీసు, రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పరిశ్రమలశాఖ అధికారులు హుటాహుటిన ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీకి తరలివచ్చారు. ఈ రియాక్టర్ పేలుడుకు సిగాచి కెమికల్ పరిశ్రమలో భద్రతా చర్యలు సరిగా తీసుకోక పోవడమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు.
తనిఖీలేవి?
సిగాచి కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ చర్యల గురించి అగ్నిమాపక శాఖ, ఇన్ స్ఫెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు సమయానుకూలంగా తనిఖీలు చేసి నివేదికలు సమర్పించాలి. కెమికల్ కర్మాగారంలో ఎక్కడైనా భద్రతా నిబంధనలు పాటించకుంటే దీనిపై పరిశ్రమ యాజమాన్యానికి నోటీసులు జారీచేయాలి. కానీ ఇవేవి జరగలేదు. దీంతో సోమవారం జరిగిన ఘోర రియాక్టర్ పేలుడుతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అధికారులే కారణమని, పరిశ్రమలో భద్రతా చర్యలపై చర్యలు తీసుకోనందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫైర్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు.
అగ్నిమాపక ఆడిట్ జరిగిందా?
మరో వైపు అగ్ని ప్రమాదాల నివారణకు పరిశ్రమలో సరైన చర్యలు తీసుకున్నారా? లేదా అనేది అగ్నిమాపకశాఖ అధికారులు చూసుకోవాలని , కానీ వారు సరైన చర్యలు తీసుకోనందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.అగ్నిమాపక శాఖ ప్రతీ ఏటా ప్రమాదాల నివారణపై ఆడిట్ నిర్వహించాలి. పనిచేయని అగ్నిమాపక యంత్రపరికరాలను తనిఖీలు చేసి నోటీసులు అందజేయాలి. అది కాలేదు. రియాక్టర్ పేలుడు ఘటన తర్వాత అన్ని విభాగాల అధికారులు వచ్చి రెస్క్యూ కార్యక్రమాల్లో మునిగిపోయారు.

పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఇండస్ట్రీస్లోని రియాక్టర్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ పేలుడు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో వైపు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రులను సంగారెడ్డి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు తరలించారు.రియాక్టర్ యూనిట్లో పేలుడు సంభవించాక తీవ్రమైన మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణనష్టం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అదుపులో మంటలు
పదకొండు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది గంటల తరబడి మంటలను అదుపు చేశారు. అంబులెన్స్, రెస్క్యూ బృందాలు గాయపడిన కార్మికులను ఆసుపత్రులకు తరలించారు.సంగారెడ్డి జిల్లా కలెక్టర్ , పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలంలోనే ఉండి, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్నాం : అధికారులు
రసాయన ప్రాసెసింగ్ సమయంలో రియాక్టర్ పనిచేయక పోవడం వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు ఈ ప్రాంతంలోని కెమికల్ కర్మాగారాల్లో భద్రతా ఆడిట్లను చేయాలని అది చేయనందువల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటనలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఒక రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా
తెలంగాణరాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని కెమికల్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మృతుల బంధువులకు పీఎం ఎన్ ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.