తెలంగాణలో ప్రతీ కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు
x

తెలంగాణలో ప్రతీ కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డులు

తెలంగాణలో పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ కుటుంబానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.దీనికోసం ఇంటింటిసర్వే చేపట్టనుంది.


పేద, మధ్య, ధనిక వర్గాలు, కుటుంబాలు అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, యూనిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ఫ్యామిలీ కార్డు ప్రధాన ఉద్ధేశ్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత మేరకు వారికి మేలు చేయాలన్న సంకల్పంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు.

- తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి మంగళవారం చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి తో కలిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (యూ‌డి‌ఏ), ఎల్‌ఆర్‌ఎస్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ధాన్యం కొనుగోళ్ళు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ల తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇంటింటి సర్వే
తెలంగాణలో ఫ్యామిలి డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాలలోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నామని ఇప్పటికే ఈ ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ నెల మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్-టు-డోర్ వివరాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు.

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి
గత నాలుగు సంవత్సరాలనుంచి లక్షలాది మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎదురు చూస్తున్నారని, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదని, కొన్ని జిల్లాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఉంటే పదుల సంఖ్యలో పరిష్కరించడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూ‌డి‌ఏ)ల పరిధి పెంపు, కొత్త యూ‌డి‌ఏల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే కలెక్టర్లు పంపించాలని ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ఆర్భాటంగా ప్రకటించి అరకొరగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిందని, ఇందులో కొన్ని మాత్రమే పూర్తి అయ్యాయని, ఈ పూర్తి అయిన ఇళ్లకు లబ్దిదారులను ఎంపిక చేసి దసరా లోపు వారికి అప్పగించాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్-చార్జ్ మంత్రి ఛైర్మన్ గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా మరికొంతమంది సభ్యులతో కమిటీ ని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.

వరద సహాయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రప్రభుత్వం 29 జిల్లాలకు, ఒక్కో జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్ నాలుగు జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఐదు కోట్ల రూపాయల చొప్పున, మున్సిపాలిటీలకు కోటి రూపాయలు, కార్పొరేషన్లకు రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని మంత్రి చెప్పారు. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు
తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 7144 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సన్న ధాన్యానికి దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిల పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీ.ఎస్. చౌహాన్, పంచాయత్ రాజ్ కార్యదర్శి లోకేశ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story