![RAJYASABHA | తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట: రాజ్యసభలో రగడ RAJYASABHA | తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట: రాజ్యసభలో రగడ](https://andhrapradesh.thefederal.com/h-upload/2024/12/06/496361-untitled-design-2.webp)
RAJYASABHA | తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట: రాజ్యసభలో రగడ
రాజ్యసభలో 222వ సీటు వద్ద దొరికినట్టు చెబుతున్న నోట్ల కట్టల వ్యవహారం సభలో దుమారం రేపింది. అవి దొంగనోట్లేమోనని కొందరు వ్యాఖ్యానించడంతో కలకలం చెలరేగింది.
రాజ్యసభలో 222వ సీటు వద్ద దొరికినట్టు చెబుతున్న నోట్ల కట్టల వ్యవహారం సభలో దుమారం రేపింది. అవి దొంగనోట్లేమోనని కొందరు, అసలు నోట్లేనని కొందరు వ్యాఖ్యానించడంతో కలకలం చెలరేగింది. ఆ సీటు తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ ఎంపీదని ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ డిసెంబర్ 6న సభలో ప్రకటించడం తీవ్ర దుమారానికి దారితీసింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరెన్సీ నోట్ల (Currency notes) వ్యవహారమై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సై అనడంతో వివాదం ముదిరింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ డిసెంబర్ 6న సమావేశమైంది. ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలో ఓ ప్రకటన చేస్తూ.. ‘గురువారం సభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్లో సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నంబరు సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించా’ అని అన్నారు.
రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ఖడ్ తెలిపారు. ఆ నోట్లు అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యత అన్నారు. దీంతో ఇది కాస్తా వివాదానికి దారితీసింది.
ఖర్గే ఏమన్నారంటే...
ఛైర్మన్ ప్రకటనను సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన.. దర్యాప్తు పూర్తికాక ముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎంపీ పేరు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ దశలో బీజేపీ సభ్యుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుంటూ ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘పేరు చెబితే తప్పేంటీ? ఏ సీటు వద్ద నగదు దొరికిందో.. అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదు. దీనిపై సీరియస్గా దర్యాప్తు జరగాలి’’ అని అన్నారు. రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాంగ్రెస్పై మండిపడ్డారు.
నేను 500 నోటే తెచ్చానన్న సింఘ్వీ..
ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. తాను కేవలం ఒకేఒక్క రూ.500 నోటు తీసుకొచ్చానన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చా. ఒంటి గంటకు సభ వాయిదా పడటంతో క్యాంటీన్కు వెళ్లా. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయా’’ అని సింఘ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కూడా ఈ వ్యవహారమై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
Next Story