‘పరాకాష్టకు చేరిన ప్రజాపాలన’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
x

‘పరాకాష్టకు చేరిన ప్రజాపాలన’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పట్టెడన్నం కోసం వసతిగృహాల్లోని విద్యార్థులు పడిగాపులు కాస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.


నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో పిల్లలకు అన్నం వండలేదూ.. గుడిలో అన్నదానంలో తినండి అని సిబ్బంది చెప్పడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందంటూ చురకలంటించారు. పిల్లలకు పెట్టడానికి పప్పన్నం కూడా లేదు కానీ.. మంత్రులు తినడానికి విందు భోజనాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. హెలికాప్టర్ యాత్రలు, విందు భోజనాలకు అలవాటు పడిన మంత్రులకు విద్యార్థులు తిప్పలు పట్టడం లేదని, పట్టెడన్నం కోసం వసతిగృహాల్లోని విద్యార్థులు పడిగాపులు కాస్తుంటే వీరికి చీమకుట్టినట్లు కూడా లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పరాకాష్టకు చేరిన ప్రజాపాలన. విషాదంలో మంత్రుల వినోదం. హెలికాప్టర్ యాత్రలు .. చేపకూర విందులు. హాస్టల్ విద్యార్థులకు మాత్రం అన్నం పెట్టకుండా పస్తులు. విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం. "అన్నం వండలేదు గుడిలో తినండి" అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేశిన హాస్టల్ సిబ్బంది. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక పస్తులు ఉన్న విద్యార్థులు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా?’’ అని నిలదీశారు.

Read More
Next Story