
బండి సంజయ్పై కాంగ్రెస్ ఫిర్యాదు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.
కేంద్రంమంత్రి బండి సంజయ్పై కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరును.. బండి సంజయ్.. పాకిస్థాన్, ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్లా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ను పాకిస్థాన్తో పోల్చడంపై పార్టీ శ్రీణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది కాంగ్రెస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేలా సదరు నేత వ్యాఖ్యలు ఉన్నాయని, ఇందుకు గానూ బండి సంజయ్పై, బీజేపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ స్వీకరించింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇంతకీ బండి సంజయ్ ఏమన్నారంటే..
‘‘మాది భారత్ టీం...వారిది పాకిస్తాన్ టీం. ఇండియా గెలవాలంటే బిజేపి కి ఓటు వేయండి. పొలిటికల్ మ్యాచ్ లో కూడా గెలివే అవకాశం మాకు ఇవ్వండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదు. మూడుసభలలొ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మాకు వచ్చిన నష్టం లేదని ముఖ్యమంత్రే అన్నారు. కులగణన కి మేము వ్యతిరేకం కాదు. 42% బిసిలకి రిజర్వేషన్లు ఇస్తామంటే మేము స్వాగతిస్తాం. కాని బిసిలలో ముస్లీం లకి రిజర్వేషన్ లు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మా బిసిలకి ఇచ్చేది 32% మాత్రమే. గుజరాత్, మధ్యప్రదేశ్లతో అభివృద్ధిలో పోటీ పడుతారా?’’ అని ప్రశ్నించారు.