Revanth Reddy | ‘ఎవరికీ అన్యాయం జరగనివ్వను’..గ్లోబల్ మాదిగ డేలో సీఎం
x

Revanth Reddy | ‘ఎవరికీ అన్యాయం జరగనివ్వను’..గ్లోబల్ మాదిగ డేలో సీఎం

రిజర్వేషన్ల విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆలస్యమైన ఆందోళన వద్దన్నారు.


రిజర్వేషన్ల విషయంలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) భరోసా ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ఎస్సీ కులాలకు అన్యాయం జరగనివ్వనని, వారికి న్యాయం జరిపించడం కోసం ఎంత దూరమైనా వెళతామని అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో నిర్వహించిన గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ విషయంలో చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని భరోసా ఇచ్చారు. కొందరు.. తమ ప్రభుత్వం ఎస్సీలకు అన్యాయం చేస్తుందని దొంగ ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ పట్టించుకోవద్దని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగిలే తాను చూస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అందింస్తున్న ప్రజా పాలన చూసి ఓర్వలేకే కొందరు కావాలని బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక వర్గం తరాల నుంచి చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, దాన్ని తమ ప్రభుత్వ తూచా తప్పకుండా ఆచరణలో పెడుతుందని చెప్పారు.

‘‘ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించాం. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం ప్రకటించాం. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయింది. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం’’ అని తెలిపారు.

‘‘60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించాం. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతని నియమించుకున్నాం. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించాం. IIT వీసీగా, విద్యా కమిషన్ మెంబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాం. పగిడి పాటి దేవయ్యని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్‌గా నియమించుకున్నాం. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం. అమలుచేయడంలో కొంత ఆలస్యం కావచ్చు... కానీ మీకు తప్పక న్యాయం చేస్తాం. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది’’ అని పునరుద్ఘాటించారు.

Read More
Next Story