ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు -సీఎం రేవంత్
x

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు -సీఎం రేవంత్

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అని కొనియాడారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు.


జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ప్రజాప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ (మ్యాక్‌) హౌసింగ్ సొసైటీకి అప్పగించారు. అలాగే, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవని తెలిపారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి, వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ వెనుకడుగు వేయలేదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు.

జర్నలిస్టు అర్ధం మార్చేస్తున్నారు...

వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలి అని జర్నలిస్టులకు సీఎం రేవంత్ సూచించారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమేనన్నారు. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి... కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. వారు జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉందని జర్నలిస్టులను కోరారు.

భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయన్నారు రేవంత్. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు అని కోరారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని అన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది అని రేవంత్ హామీ ఇచ్చారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నాను, వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటామని చెప్పారు.

ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు భాగస్వాములు...

తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవని సీఎం తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మేం మీలో ఒకరమే... మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే అన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నామన్నారు. "ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం" అంటూ జర్నలిస్టులకు కీలక హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read More
Next Story