దసరా సందర్భంగా సీఎం రేవంత్ ఆయుధ, జమ్మి పూజ
x

దసరా సందర్భంగా సీఎం రేవంత్ ఆయుధ, జమ్మి పూజ

విజయదశమి సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆయుధ పూజ చేశారు. అనంతరం సీఎం తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి వచ్చి జమ్మిపూజలో పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకే -47 తుపాకులు పెట్టి సీఎం చేసిన ఆయుధ పూజా కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం

తన స్వగ్రామం అయిన కొండారెడ్డి పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సదుపాయాలతో రూ.18 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం,అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, రూ.64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం,ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ, రూ.32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, బహిరంగ వ్యాయామశాల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.



సీఎంకు ఘనస్వాగతం

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను సీఎం నాటారు.రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు.ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, శాసనసభ్యులు వంశీతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More
Next Story