
పాలమూరు ప్రాజెక్ట్కు జాతీయ హోదా.. తేల్చి చెప్పిన కేంద్రం
అసలు జాతీయ హోదా ఏ ప్రమాణాల ప్రకారం ఇస్తారు. ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఎలాంటి ప్రాజెక్ట్లు ఇందుకు అర్హత పొందుతాయి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలుసార్లు ప్రతిపాదనలు చేసింది. కాగా వీటిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వెనక్కు పంపేసింది. కృష్ణా నది జలాలపై ఆంధ్ర, తెలంగాణ మధ్య భారీ వివాదం జరుగుతుందని, ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతుందని కేంద్రం గుర్తు చేసింది. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ టెక్నో ఎకనామిక్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపానలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో కేంద్రం వివరించింది.
2022 సెప్టెంబర్లో తెలంగాణ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, 2024 డిసెంబర్లో ఈ ప్రతిపాదనలను తిప్పి పంపామని కేంద్రం చెప్పింది. లోక్సభలో పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించడంపై భువనగికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయక మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కోర్టు వివాదం పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను సమీక్షించే అవకాశం ఉండొచ్చని తెలిపింది.
జాతీయ ప్రాజెక్ట్ హోదా అంటే..
ఒక ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు అంశాలను పరిశీలిస్తుంది. వీటిలో ఒక్క అర్హతను కలిగి ఉన్నా కేంద్రం ఆ ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించడాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.
1. అంతర్జాతీయ స్థాయిలో అంటే విదేశాలతో కలిసి అయినా నిర్మించేలా ప్రాజెక్ట్ ఉండాలి. చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి వాటాను దేశం వాడుకునే వీలుండాలి. ఎక్కడ కడుతున్నారు? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తవుతుంది అనే సమగ్ర సమాచారం ఉండాలి. ఆ ప్రాజెక్ట్తో దేశీయ సమస్యలు తీరతాయి. ఆ ప్రాజెక్ట్తో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర జలశక్తిశాఖ భావిస్తే అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటుంది.
2. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చే అంతర్రాష్ట్రాల ప్రాజెక్టులు. రాష్ట్రాల మధ్య తగాదాల కారణంగా ఖర్చుల విభజన, పునరావాసం, విద్యుత్ ఉత్పత్తి అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్రం సమస్యను తీరుస్తుంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులు కూడా ఈ కోవలోకి వస్తాయి.
3. ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే ఉండి.. ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే ప్రాజెక్టులు. రాష్ట్రంలోని ప్రజల సాగునీటి అవసరాలు తీర్చగలగాలి. ముఖ్యంగా రెండు లక్షల హెక్టార్లకు మించి పొలాలకు సాగు నీరు అందించాల్సి ఉంటుంది. నీటి పంపకాల విషయంలో ఎలాంటి తగాదాలు ఉండకూడదు. ప్రాజెక్టులోని నీరు తిరిగి ప్రాజెక్టులో చేరే విధంగా 'హైడ్రాలజీ' అనుకూలత కలిగి ఉండాలి.
4. విస్తరణ, పునర్నిర్మాణం, ఆధునికీకరణ (ఈఆర్ఎం) ప్రాజెక్టులు. అంటే అప్పటికే ఉన్న ఓ ప్రాజెక్టును పొడిగించడం లేదా పునరుద్ధరణ పనులు చేస్తే కనీసం 2 లక్షల హెక్టార్లకు నీరు అందించే స్థాయికి రావాలి.
అర్హత ఉంటే హోదా రాదు..
పైన పేర్కొన్న అర్హతలు ఉంటే జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అర్హత ఉన్నంత మాత్రాన హోదా వస్తుందని చెప్పడానికి లేదు. అర్హత ఉండటంతో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం.. ఒక ప్రాజెక్ట్కు జాతీయ హోదా ఇస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టు ఉన్నప్పుడు మాత్రమే జాతీయ హోదా సాధ్యమవుతుంది.
సాగునీటి సలహా సంఘం ప్రాజెక్టు అనుకూలతల్ని పరిశీలిస్తుంది. దాని నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
వరద ముంపు నివారణ, బహుళసార్ధక ప్రాజెక్టుల నిర్వహణ చూసే జలవనరుల శాఖ(డీవో డబ్ల్యూఆర్) ఆమోదం తెలపాలి.
నిర్దేశించిన ప్రమాణాలు ప్రాజెక్టులో ఉన్నాయని నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవనం(ఆర్డీ&జీఆర్) సంతృప్తి చెందాలి.
పెట్టుబడులకు తగిన అనుమతులు ఉండాలి. ప్రాజెక్టు కట్టొచ్చా లేదా అనే విషయంపై హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ సిఫారసులు రావాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నిధుల లభ్యత గురించి అంచనా వేయాలి.
ఇక జాతీయ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలోనూ కేంద్రానికి, రాష్ట్రాలకు వాటా ఉంటుంది. కేంద్రం వాటా అన్ని రాష్ట్రాలకు స్థిరంగా ఉండదు. ఆయా ప్రాంతాల వెనుకబాటు ఆధారంగా ఎంత వాటా ఇవ్వాలన్న విషయంపై ఇదివరకే కొన్ని ప్రమాణాలున్నాయి.
మంచి నీటి ప్రాజెక్ట్లకూ అవకాశం
అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వంటి 8 ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 2 హిమాలయ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లలో నిర్మించే నీటి ప్రాజెక్ట్లకు అయ్యే ఖర్చును కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా కింద నిధులు విడుదలవుతాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ప్రాజెక్ట్లకు నిధుల పంపిణీ నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది.
నీటిపారుదల కోసం కడుతున్న ప్రాజెక్ట్లతో పాటు తాగునీటి ప్రాజెక్ట్లకు కూడా జాతీయ హోదా అందే అవకాశం ఉంది. తాగునీటి అవసరాలు తీరడం, నదులు, రిజర్వాయర్లు, కాలువల నుంచి వచ్చే నీరు, భూమిలోపలి జలవనరుల శాతాన్ని పెంచుతూ చెరువులను నింపే ప్రాజెక్ట్లకు కూడా జాతీయ హోదా అందే అవకాశం ఉంది. కాకపోతే ఇలాంటి ప్రాజెక్ట్లకు జాతీయ హోదా అందడం చాలా క్లిష్టమైన అంశం.