
‘అన్ని అంశాలపై చర్చిద్దాం’.. రేవంత్ సవాల్కు హరీష్ సై
నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా? రేవంత్ రెడ్డి అని హరీష్ రావు విమర్శించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలన, బీజేపీ 14 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 14 నెలల పాలనపై దమ్ముంటే చర్చకు రావాలంటే కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కాగా ఆయన సవాల్ను బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరించారు. చర్చ ఎక్కడ పెట్టేది రేవంత్ ఇష్టమని, ఆయన ఎక్కడి రమ్మంటే అక్కడకు ఎప్పుడంటే అప్పుడు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని హరీష్ రావు తెలిపారు. ఆరు గ్యారెంటీలు, 420క హామీలు సహా అన్ని అంశాలపై చర్చిద్దామని అన్నారు. చర్చించడం నిందులు వేసినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా నారాయణపేటలో మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్ట్పై నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారని రేవంత్పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు.
‘‘తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు. కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావు. పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ లతో అనునిత్యం అంటకాగి పాలమూరుకు తీరని ద్రోహం చేసింది నువ్వు రేవంత్ రెడ్డి. పాలు తాగి రొమ్ము గుద్దిన చరిత్ర నీది. అది చరిత్ర చెపుతున్న సత్యం. పాలమూరును దత్తత తీసుకున్న అని చెబుతూనే పడావు పెట్టిండు నీ గురువు చంద్రబాబు. ఆ చంద్రబాబుకు పాద సేవ చేస్తూ పాలమూరు ప్రయోజనాలను కాలరాచిన నీ పాపమే పాలమూరుకు శాపమైంది’’ అని విమర్శించారు.
‘‘ఆనాడు తెలంగాణలో ఓట్లడిగే మొఖం చెల్లక మా పొత్తు కోసం జోలె పట్టింది నువ్వు ఇప్పటికీ నెత్తికెత్తుకునే నీ ప్రియమైన తెలుగుదేశం పార్టీ. పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చి, పాలమూరు ప్రజల బతుకుల్లో నిప్పులు పోసింది కాంగ్రెస్. పాలమూరు ను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్, టీడీపీ లది అయితే ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్ రెడ్డి కి ఆ రెండు పాపాల్లో వాటా ఉంది. పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతామన్నందుకే కదా నీ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మేం బయటకు వచ్చినాము. నదీ జలాల్లో మీ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగానే ఆనాడు 40 రోజులు పాటు అసెంబ్లీనీ స్థంభింప చేసినం’’ అని తెలిపారు.
‘‘నువ్వు వక్రీకరించినంత మాత్రాన చరిత్ర మారుతుందా? నీ వక్రబుద్ధి ప్రజలకు తెలియకుండా పోతుందా? పోతిరెడ్డి పాడు నీళ్లు తరలిస్తుంటే హారతులు ఇచ్చింది ,వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఊడిగం చేసింది కాంగ్రెస్ నేతలనే చరిత్ర మరచి రేవంత్ మాట్లాడటం గురివింద సామెత ను గుర్తు చేస్తోంది. చంద్రబాబు కు ఊడిగం చేసినా మోడీ కి భయపడి బడే భాయ్ అన్నా అది రేవంత్ లాంటి ఊసరవెల్లి కే సాధ్యం. రేవంత్ కు నీటి విలువ తెలియదు, నోటి విలువ తెలియదు. తెలిసింది ఒక్క అవినీతి నోట్ల విలువ మాత్రమే. రేవంత్ నోరుంది. కదా అని అడ్డగోలుగా మాట్లాడకు, నువ్విప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రివనే విషయం మరచిపోకు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డుపడుతూ కేసులు వేయించిన ఘాతకుడివి నువ్వే. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని 90% పనులు పూర్తి చేసినం. మిగిలిన 10% పనులు చేయకుండా కావాలని పండపెట్టి పాలమూరు ప్రజల ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లివి నువ్వు’’ అని చురకలంటించారు.
ముఖ్యమంత్రి @revanth_anumula తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 21, 2025
కృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నావు.
పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు…
‘‘పాలమూరు ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తే జనం కేసీఆర్ పేరుని తలుచుకుంటరనే కుళ్ళు బుద్ధితోని కావాలనే ప్రాజెక్టు పనులను పండబెట్టినవు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే కొడంగల్ నారాయణపేటకు కూడా నీళ్లు వస్తాయి. కేవలం మీ స్వార్థం కోసం, కమిషన్ల కోసం నారాయణపేట ఎత్తిపోతల పథకాన్నీ తెరమీదకు తెచ్చినవు. నీ దరిద్రపు కాంగ్రెస్ రాకుంటే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేసి నారాయణపేట కొడంగల్ రైతుల కాళ్లు కడిగేవాళ్లము. నిన్ను ఎన్నుకున్న ఖర్మానికి పాలమూరు ప్రజలకు నీటి కటకట మొదలైంది. కాంగ్రెస్ పాలనలో వలసలకు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆర్, వలస బోయిన వాళ్లను వాపస్ తెచ్చింది కేసీఆర్. మీ పాలనలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్. కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్లో 2014 వరకు కేవలం 27వేల ఎకరాలే సాగైతే, ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి దాన్ని ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచింది కేసీఆర్. జూరాలకు సంబంధించి కర్ణాటకలో ఉన్న సబ్మర్జెన్స్ కాంపెన్సేషన్ చెల్లించి పూర్తిస్థాయిలో నీటిని నింపి లక్ష ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు అందించింది కేసీఆర్’’ అని గుర్తు చేశారు.
‘‘ఆర్డీఎస్ కింద మీ దరిద్ర బోర్డు పాలనలో 30 నుంచి 35000 ఎకరాలకు మించి ఎన్నడూ సాగయ్యేది కాదు. మేము తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తి చేసి రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్ళు అందించినం. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినం. పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలనలో దాదాపు 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు పాలమూరులో నీళ్లు అందించిన ఘనత మాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తికాగానే మరో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. బీఆర్ఎస్ చేసిన కృషితోనే రాష్ట్రంలో అత్యధికంగా సాగునీటి వసతి కలిగిన సస్యశ్యామల జిల్లాగా పాలమూరు మారుతుంది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వని అర్బకుడివి నువ్వు కేసీఆర్ మీద రంకెలేస్తావా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఉత్త వాగుడే తప్ప ఒక్క వాగు మీద కూడా ఒక్క ఇటుక పెట్టని ఒక్క చెక్ డ్యాం కూడా వదరుబోతువు నువ్వు. 14 నెలల్లో ఒక్క చెక్ డాం కూడా కట్టని చేతగాని ముఖ్యమంత్రివి నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడుతావా ?’’ అని ప్రశ్నించారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, చేతగాని రేవంత్ రెడ్డికి కోతలెక్కువ అని ఎద్దేవా చేశారు. నీ పనికిమాలిన పద్నాలుగు నెలల పాలన మీద చర్చకు నేను సిద్ధం. నీ సవాలను స్వీకరిస్తున్నా అని స్పష్టం చేశారు.
‘‘ఏ రోజు చర్చ చేద్దాము, ఎక్కడ చర్చ చేద్దాము నువ్వే చెప్పు. నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా. నీ కొడంగల్ నియోజకవర్గమైన సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా నీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో పాటు, రుణమాఫీ సంగతి, రైతుబంధు సంగతి, మహాలక్ష్మి పథకం సంగతి, పెంచవలసిన పెన్షన్ల సంగతి, నిరుద్యోగ భృతి సంగతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏల సంగతి, పెన్షనర్లకు ఇవ్వని పెన్షన్ బెనిఫిట్ ల సంగతి సకలం చర్చిస్తా.. నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా. రేవంత్ రెడ్డి కుసంస్కారి కనుకే కేసీఆర్ పై కక్ష పూరిత ఆరోపణలు. దవడలు పగల గొట్టాల్సివస్తే అన్నింటా దగా చేసి ఏపీ కృష్ణా జలాల దోపిడీని నిలువరించలేకపోతున్నా. నీ దవడనే పగలగొట్టాలి. అరుపులు ,పెడబొబ్బలతో రాష్ట్ర సాగు తాగు నీళ్ల కష్టాలు తీర్చలేవు రేవంత్ రెడ్డి’’ అని తెలిపారు. ‘నిందలు వేయడం మాని నదీజలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడు. కడుపులో విషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలతో పాలన చేస్తే ఫలితాలు రావు అబద్దాల కోసం అజ్ఞానిలా నీ బుర్రను వాడే బదులు పది మందికి ఉపయోగపడేలా పాలన అందించడానికి ప్రయత్నించు రేవంత్ రెడ్డి’ అని అన్నారు.