డీఎస్సీ పై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
x

డీఎస్సీ పై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

నిరుద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


నిరుద్యోగుల ఆందోళనలు ఉద్రిక్తమవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం సాయంత్రం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుద్యోగులు డీఎస్సీకి బాగా ప్రిపేర్ అవ్వాలని సూచించారు. 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నాం, త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేక పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని భట్టి చెప్పుకొచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం బీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో గ్రూప్ వన్, గ్రూప్ 2, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేశారు అని మండిపడ్డారు.

ఇందిరమ్మ రాజ్యం రాగానే మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది.. ఇందులో గురుకుల పిఈటి, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని చేప్పారు.

"గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ డీఎస్సీ నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేసి వారు 5000 మందికి నోటిఫికేషన్ ఇవ్వగా, మేం మరో 6000 కలిపి 11 వేల మందికి నోటిఫికేషన్ ఇచ్చాం. తాజా నోటిఫికేషన్ కు స్పందించి 2.79 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే రెండు లక్షల 5వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11,000 మంది నోటిఫికేషన్ కు పోగా మరో ఐదు వేల ఖాళీలు ఉన్నాయి. ఈ ఐదువేల ఖాళీలతో పాటు మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్ లు వేస్తూనే ఉంటుంది" అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ఇటీవల రాష్ట్రంలో 19 వేల మంది పైచిలుకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో సీఎల్పీ నేతగా తాను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా నోటిఫికేషన్ వేస్తే ఆ పేపర్ లీక్ అయ్యింది అని గుర్తు చేశారు. మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేసి మెయిన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించాము. 31,382 మంది గ్రూప్ వన్ మెయిన్స్ కు ఎంపికయ్యారు. మెయిన్స్ ఏడు పేపర్లకు సంబంధించిన పరీక్షల తేదీలు ఖరారు చేశారని చెప్పారు.

గత ప్రభుత్వం గ్రూప్-2 ఎగ్జాంను మూడుసార్లు వాయిదా వేసింది.. 800 పోస్టులకు 5,51,943 మంది అప్లై చేయగా మా ప్రభుత్వం రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేసింది అని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం గ్రూప్ 3 పరీక్షల కోసం 30/12/2222 న 1,380 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు.. కానీ పరీక్షలు నిర్వహించలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రూప్ 3 కి సంబంధించిన మూడు పేపర్లకు పరీక్షలు నిర్వహించేందుకు నవంబర్ మాసంలో తేదీలు ఖరారు చేశామన్నారు. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ప్రభుత్వం ఆశ. డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు బాగా పరీక్షలు రాసి త్వరితగతిన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద బిడ్డలకు పాఠాలు చెప్పాలనేది మా ప్రభుత్వం కోరిక అని భట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ ని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు.

Read More
Next Story