‘జర్నలిస్టులతో ఆడుకోవద్దు’.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
x

‘జర్నలిస్టులతో ఆడుకోవద్దు’.. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

జర్నలిస్టులకు అందించిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.


జర్నలిస్టులకు అందించిన ఇళ్ల పట్టాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇది ఏమాత్రం సమంజసంకాదని, జర్నలిస్టుల నోటికాడ కూడు లాక్కోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. జర్నలిస్టులంటే సీఎం రేవంత్ రెడ్డి చులకనగా చూస్తున్నారామో.. అది సరైన పద్ధతి కాదంటూ హితవు పలికారు. జర్ణలిస్లు ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎంతో శ్రమిస్తారని, వారి కష్టాలను తెలుసుకోవాలని సీఎంకు సూచించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల కష్టాలను వివరిస్తూ ఆయన సీఎంకు లేఖ రాశారు. బతుకమ్మ పండగ ముందు కరీంనగర్ జర్నలిస్టుల బతుకులపై కొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అన్ని పథకాల్లో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు కూడా మహిళలకే ప్రాధాన్యత అని, తమ ప్రభుత్వం మహిళనే ఇంటి యజమానిగా చూస్తుందని చెప్పి ఆ మహిళ పేరిటన ఇచ్చిన ఇళ్ల స్థలాలనే రద్దు చేయడం, అది కూడా అతి ముఖ్యమైన దసరా, బతుకమ్మ ముందు చేయడం మరీ దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ చర్యలతో ఎంత మంది మహిళల కుటుంబాలను రోడ్డుకీడుస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇళ్ల స్థలాలను రద్దు చేస్తూ జర్నలిస్టులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచి పద్దతి కాదని హితవు పలికారు.

బండి సంజయ్ లేఖ ఇలా..

‘‘బతుకమ్మ పండుగ ముందర కరీంనగర్ జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమైన విషయం. అన్ని పథకాల్లో మహిళలకే మీరు ప్రాధాన్యత ఇస్తామని.. 'మహాలక్ష్మి' పథకం అందిస్తామని... ఇంటి యజమానురాలుగా మహిళనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. సీఎం హోదాలో మీరు, మీ మంత్రివర్గ సహచరులు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో అతి పెద్ద పండుగైన విజయదశమి ముందర, మహిళలకు ఇష్టమైన బతుకమ్మ పండుగ ముంగిట జర్నలిస్టు కుటుంబ సభ్యులైన మహిళల పేరిట ఇచ్చిన ఇండ్ల స్థలాలను రద్దు చేసి వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?

కరీంనగర్ లోని 118 జర్నలిస్టులకు వారి భార్యల పేరిటి పేరిట 2023 అక్టోబర్ 7వ తేదీన ప్రొసీడింగ్ నెంబర్. DCOKNR/2BHK/9/2021/E-sec ద్వారా ప్రొసీడింగ్ ఇస్తూ.. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట వద్ద పట్టాల తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులను ఎంపిక చేసామని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చారు. జర్నలిస్టులందరికి.. వారి సతీమణుల పేరిట ఈ పట్టాలను గత బతుకమ్మ పండుగ ముందర అందించారు. తర్వాత మీ ప్రభుత్వం రాగానే.. అందులో కొందరు అనర్హులు ఉన్నారంటూ.. మీ ప్రభుత్వంలోని కొందరి ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. చేతికి అందిన పట్టాలు.. చూస్తూ ఇన్నాళ్లు మురిసిన జర్నలిస్టులు.. ఎప్పుడెప్పుడు తమకు కేటాయించిన స్థలాల్లోకి వెళ్లే అవకాశం ఇస్తారని ఆశతో ఎదురు చూశారు.

విచారణ తర్వాత.. అనర్హులను తీసేసి అర్హులైన వారికి ఇస్తారని ఎదురు చూశారు. కానీ అన్యాయంగా.. చావు కబురు చల్లగా చెప్పినట్టు గతంలో ఇచ్చినవి రద్దు అయ్యాయని ఇప్పుడు అధికారులు చెప్పడం బాధాకరం. నోటి కాడ ముద్ద లాగేసుకున్నట్లు మీ ప్రభుత్వం అనుసరించిన తీరు శోచనీయం. బతుకమ్మ పండుగ ముందు జర్నలిస్టు ఇంట ఆడపడుచు కన్నీళ్లు పెట్టే పరిస్థితి మంచిది కాదు. వారంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఏందనేది మీకు తెలుసు. వారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమేనని, అత్యధిక మంది జర్నలిస్టులు నేటికీ కిరాయి ఇండ్లల్లోనే జీవనం సాగిస్తన్న విషయం విదితమే. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని గతంలోనూ పలుమార్లు మిమ్ముల్ని కోరాను.

ఇప్పటికైనా మీరు వెంటనే స్పందించి కరీంనగర్లో జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నా, గతంలో ఇచ్చిన ఇండ్ల పట్టాల్లో ఎవరైనా కొంతమంది అనర్హులు ఉంటే వాళ్లను తీసేసి ఏళ్ల తరబడి ఇదే వృత్తితో చాలీచాలని వేతనాలతో బ్రతుకు సాగిస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగా రద్దు చేసిన ఇండ్ల పట్టాలను వెంటనే పునరుద్దరించడంతోపాటు ఆ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నా, జిల్లాలో అర్హులుగా ఉండి ఇండ్ల స్థలాలకు నోచుకోని మిగిలిన జర్నలిస్టులకు కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలి. ఈ విషయంలో మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని బండి సంజయ్ రాసుకొచ్చారు.

Read More
Next Story