చంచల్గూడ జైలుకు పుష్పరాజ్..
అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ బన్నీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఈ అంశం అరెస్ట్ వరకు వచ్చిన క్రమంలో ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నతన్యాయస్థానం తెలిపినట్లు సమాచారం. దీంతో అల్లు అర్జున్న అరెస్ట్ వ్యవహారంలో నాంపల్లి కోర్టుదే తుది నిర్ణయంగా మారింది. ఆయనపై బీఎన్ఎస్ 105(నాన్ బెయిలబుల్), 118(1) సెక్షన్ల కింద కేసు నమోదైన క్రమంలో అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి న్యాయస్థానం. దీంతో అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించడానికి పోలీసులు సన్నాహాలు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే పోలీసులకు థియేటర్ యాజమాన్యం ముందస్తు సమాచారం అందించలేదన్న వ్యాఖ్యలను సంధ్యా థియేటర్ కొట్టిపారేసింది. తాము ఈ నెల 2వ తేదీనే పోలీసులకు లేఖ రాశామని, పుష్ప-2 రిలీజ్ అవుతున్న క్రమంలో సినిమాను అభిమానులతో కలిసి చూడటం కోసం హీరో, హీరోయిన్, మూవీ టీమ్, పలువరు ప్రముఖులు రానున్నారని, దాంతో ఇక్కడ భారీ సంఖ్యలో అభిమానుల రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున డిసెంబర్ 4, 5 తేదీల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీసులకు లేఖ రాశామని సంధ్య థియేటర్.. సదరు లేఖ ఫొటోను విడుదల చేసింది. అయితే తమకు అల్లు అర్జున్ నుంచి కానీ, థియేటర్ యాజమాన్యం నుంచి ఏమాత్రం సమాచారం రాలేదని డీసీపీ అక్షాంశ్ యాదవ్ గతంలోనే తెలిపారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న సంధ్య థియేటర్ యాజమాన్యం.. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ లేఖను విడుదల చేయడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.