RTE అడ్మిషన్లను నిలిపేసిన తమిళనాడు ప్రభుత్వం
x

RTE అడ్మిషన్లను నిలిపేసిన తమిళనాడు ప్రభుత్వం

‘నిధుల విడుదల చేయని కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు త్వరలో విచారణకు వస్తుంది’-డీఎంకే ఎంపీ పి. విల్సన్


తమిళనాట(Tamil Nadu) విద్యాసంస్థల్లో RTE (విద్యా హక్కు) ప్రవేశాలను స్టాలిన్ ప్రభుత్వం నిలిపేసింది. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 600 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏటా తమిళనాడులో RTE చట్టం కింద దాదాపు 80 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతారు. ఈ చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25 శాతం సీట్లను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు రిజర్వ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా ఏప్రిల్ మధ్యలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలై మే చివరికి ముగుస్తాయి. ఇలా అడ్మిషన్లు ఇచ్చిన ఈ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులకు మంజూరు చేస్తాయి. కేంద్ర నుంచి నిధులు విడుదలకాకపోవడంతో ఈ సంవత్సరం అడ్మిషన్‌లను ఆపేశారు.

నిధుల విడుదలలో జాప్యం ఎందుకు?

తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP) - 2020ని ఆమోదించకపోతే సమగ్ర శిక్ష పథకం కింద నిధుల విడుదల సాధ్యంకాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చెప్పారు. ఈ విధానం కింద విద్యార్థులు ఇంగ్లీషు, హిందీ లేదా సంస్కృతంతో బాటు మాతృభాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే తమిళనాడు హిందీభాషను వ్యతిరేకిస్తుంది. చాలా ఏళ్ల నుంచి రెండు భాషలను (ఇంగ్లీషుతో పాటు మాతృభాష తమిళం) మాత్రమే ప్రోత్సహిస్తోంది.

'కేంద్రం నుంచి స్పందన లేదు'

పెండింగ్‌ బకాయిలను త్వరగా విడుదల చేయాలని గత వారం పంపిన లేఖకు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదని పాఠశాల విద్యా మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి మీడియాతో అన్నారు. ఆర్టీఈ విద్యార్థులకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లించలేని కారణంగా అడ్మిషన్లను ఆలస్యం చేయాలని నిర్ణయించిందని పాఠశాల విద్యా శాఖ సీనియర్ అధికారి ఒకరు ది ఫెడరల్‌కు తెలిపారు.

సుప్రీంలో కేసు..

రెండేళ్లుగా పెండింగ్‌ బకాయిలకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఈ కేసు గురించి అడిగినపుడు తర్వలో విచారణకు వస్తుందని డీఎంకే ఎంపీ, సీనియర్ న్యాయవాది పి విల్సన్‌ చెప్పారు.

త్రిభాషా విధానంపై మాటల యుద్ధం..

త్రిభాషా విధానంపై కేంద్రంలోని బీజేపీకి, తమిళనాడులోని డీఈంకే (Dravida Munnetra Kazhagam) ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలన్నది కేంద్రం యోచన. అయితే తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామని, హిందీ భాషాను అనుమతించమని సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) స్పష్టం చేశారు. జాతి, సంస్కృతికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని కూడా ఆయన హెచ్చరించారు.

పొరుగు రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ

‘‘హిందీ కారణంగా 100 ఏళ్లలో 19 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోల్పోయాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయి. తమిళనాడుకు ఆ దుస్థితి రాకూడదనే పోరాడుతున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై చేస్తున్న దాడిని’ ప్రతిఘటించండి’’ అని స్టాలిన్‌ గతంలో పొరుగు సీఎంలకు లేఖ కూడా రాశారు.

Read More
Next Story