
రాహుల్ కొచ్చి సభ 2026 ఎన్నికల ప్రచారానికి తొలి సంకేతమా?
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సూచనగా కొచ్చిలో రాహుల్ గాంధీ నిర్వహించిన ‘మహా పంచాయతీ’ యూడీఎఫ్ ఎన్నికల ప్రచారానికి అనధికారిక ఆరంభం..
కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కొచ్చి(Kochi)లో ‘మహా పంచాయతీ’ పేరుతో సోమవారం నిర్వహించిన కార్యక్రమం 2026 కేరళ(Kerala) అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రోత్సాహకంగా కనపిస్తోంది. వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రతినిధులను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభ.. రాబోయే ఎన్నికలపై పార్టీ ఆశావాదాన్ని ప్రతిబింబించింది.
బీజేపీ(BJP)–ఆర్ఎస్ఎస్(RSS)పై విమర్శలు..
కొచ్చి మెరైన్ డ్రైవ్లో వేలాది మంది పంచాయతీ, మున్సిపల్ ప్రతినిధులనుద్దేశించి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు యూడీఎఫ్పై పెరుగుతోన్న ప్రజా విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్పై నేరుగా దాడి చేయకుండా.. ప్రధానంగా బీజేపీ–ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు. దేశంలో అధికారాన్ని కేంద్రీకరించే రాజకీయ ధోరణికి కాంగ్రెస్ వ్యతిరేకమని, వికేంద్రీకరణే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని స్పష్టం చేశారు. బలమైన స్థానిక స్వపరిపాలన సంస్థలే రాజ్యాంగ విలువలను కాపాడగలవని పేర్కొన్నారు.
కేరళ మత, సాంస్కృతిక భేదాలకు అతీతంగా ఐక్యంగా ఉందని రాహుల్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుతో రాజీ పడలేమని, ప్రజలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీజేపీ–ఆర్ఎస్ఎస్ ‘అధికార కేంద్రీకరణ’ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన రాహుల్..కాంగ్రెస్ అధికార వికేంద్రీకరణకు మద్దతు ఇస్తుందన్నారు. నిశ్శబ్దం, నిర్లక్ష్యం పెరిగితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు.
‘స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకం’
ఈ సభలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ మాట్లాడుతూ.. యుడీఎఫ్ రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో స్థానిక సంస్థల ప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. అభివృద్ధి, పారదర్శకత, సామాజిక న్యాయం యూడీఎఫ్ రాజకీయ కార్యాచరణలో కేంద్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అట్టడుగు స్థాయి కార్యకర్తల బలం, ప్రజలతో నేరుగా ఉన్న అనుబంధమే 2026 ఎన్నికల్లో యూడీఎఫ్కు విజయ మార్గమని నేతలు విశ్వసిస్తున్నారు.
విజయంపై రాహుల్ ధీమా..
కేరళ రాజకీయ సంస్కృతి ఎప్పుడూ చర్చ, భాగస్వామ్యం, సామాజిక చైతన్యంతో రూపుదిద్దుకుందని రాహుల్ పేర్కొన్నారు. సమాజాన్ని విభజించే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానం, శత్రుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగావకాశాల కోసం యువత విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని చెబుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధిస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి కొచ్చి సభ ఒక విజయోత్సవం మాత్రమే కాదు. ఇది యూడీఎఫ్ రాజకీయ పునఃప్రారంభానికి సంకేతం. ఈ ఆశావాదాన్ని ప్రజల నమ్మకంగా మార్చగలిగితేనే 2026 ఎన్నికల్లో యుడిఎఫ్ నిజమైన పోటీగా నిలబడగలదు. కొచ్చి నుంచి వచ్చిన సంకేతం స్పష్టం — కాంగ్రెస్ కేరళలో మళ్లీ రాజకీయ సమీకరణకు సిద్ధమవుతోంది.

