
కేరళలో S.I.R పై సీఎం విజయన్ 'మౌనం'..ఎందుకు?
ప్రశ్నించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
కేరళ(Kerala)లో ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) అమలు కాబోతుంది. దీన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ఎందుకు వ్యతిరేకించడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘‘ఇండియా బ్లాక్లోని ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ SIR ను వ్యతిరేకించారు. CPI(M) కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడింది. కానీ కేరళ ముఖ్యమంత్రి ఇంకా ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నారు.
ఈ నెల ప్రారంభంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీపీ) ఎన్నికల సంఘం నిర్ణయాన్ని విమర్శించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ఈ దశలో ఎస్ఐఆర్ ఆచరణీయం కాదని పేర్కొంది. కేరళలో 2002 ఓటరు జాబితా ఆధారంగా సవరణ ప్రక్రియ జరుగుతోందని, 2025 జాబితా నుంచి సుమారు 53.25 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతవుతాయని కేపీసీసీ ఆందోళన వ్యక్తం చేసింది.
S.I.R ను స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి BJP పన్నిన వ్యూహమని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని UDF దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. దీనికి ప్రతిస్పందనగా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉదహరిస్తూ.. కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు కేల్కర్ SIR ని వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.