
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాటలో ఎన్డీఏ ప్రభుత్వం
అవినీతి పాలనతో తమిళులు వెసుగెత్తారన్న కేంద్ర మంత్రి అమిత్ షా..
వచ్చే ఏడాది తమిళనాడు(Tamil Nadu), పశ్చిమ బెంగాల్(West Bengal)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ(NDA) కూటమి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) చెప్పారు. మధురైలో ఆదివారం జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. డీఎంకే అవినీతి పాలన తమిళనాడులోని పేదలు, మహిళలు, పిల్లలను ప్రభావితం చేసిందని ఆరోపించారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ పార్టీ ప్రభుత్వాన్ని ఈ సారి అధికారానికి దూరం చేయాలని పార్టీ సభ్యులను కోరారు. TASMAC కుంభకోణంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఆ అవినీతి సొమ్ముతో తమిళనాడు అంతటా ప్రతి పాఠశాలలో రెండు తరగతి గదులను నిర్మించవచ్చన్నారు. 2021 ఎన్నికల హామీలను డీఎంకే నెరవేర్చిందో లేదో స్టాలిన్ ప్రజలకు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో తమిళనాడుకు రూ.6.80 లక్షల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. అయినా కేంద్రం ఏమి ఇవ్వలేదని అనడం ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలన్నారు. ఏప్రిల్లో తమిళనాడు పర్యటన సందర్భంగా అన్నాడీఎంకేతో సంబంధాల పునరుద్ధరణను షా ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. డీఎంకే పాలనలో పశ్చిమ కొంగు ప్రాంతంలోని గ్రామాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపునకు కార్యకర్తలు ధృఢ సంకల్పంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
గరిష్ట సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సమావేశానికి ముందు షా మధురై మీనాక్షి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.