
కర్ణాటక గవర్నర్ గెహ్లాట్పై మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆగ్రహం..
ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాల్సిన గవర్నర్..బీజేపీ అహంకారానికి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ధ్వజం..
గవర్నర్ గెహ్లాట్ (Governer Gehlot) ప్రవర్తన కర్ణాటక రాజకీయ చరిత్రలో కొత్త సంఘర్షణకు దారితీసింది. గవర్నర్ రాజ్యాంగ మర్యాదలను గాలికి వదిలేసి కన్నడిగులను, జాతీయ గీతాన్ని అవమానించారని గ్రామీణాభివృద్ధి మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ను బీజేపీ రాజకీయ పావుగా ఉపయోగించుకుంటుందని ఆరోపిస్తూ.. ఇది ముమ్మాటికి కన్నడిగుల ఆత్మగౌరవంపై దాడి అని పేర్కొన్నారు.
‘జాతీయ గీతానికీ గౌరవం ఇవ్వలేదు.’
సభ మర్యాద ఉల్లంఘన, జాతీయ గీతాన్ని అగౌరవపరచడం ఘటనలను ప్రస్తావిస్తూ.."జాతీయ గీతం వినిపించే వరకు ఉండకుండా గవర్నర్ వెళ్లిపోవడం సభ మర్యాదలను ఉల్లంఘించడమే. బీజేపీ ఎప్పుడూ దేశభక్తి గురించి మాట్లాడుతుంది. కానీ గవర్నర్ జాతీయ గీతానికి కనీస గౌరవం కూడా వారి నిజస్వరూపాన్ని బయటపెట్టింది" అని ఖర్గే మండిపడ్డారు.
‘కన్నడిగులకు తీవ్ర అవమానం..’
ప్రభుత్వ ప్రసంగాన్ని చదవకుండా కేవలం నాలుగు లైన్లకే పరిమితం చేయాలన్న గవర్నర్ నిర్ణయాన్ని ఖర్గే తీవ్రంగా ఖండించారు. "కన్నడిగుల ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి ఆయనకు ఇష్టం లేదు. ప్రభుత్వ విధానాలు, నిబంధనలను ప్రజలకు తెలియజేయాల్సిన గవర్నర్.. బీజేపీ అహంకారానికి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. ఇది ఏడు కోట్ల కన్నడిగులకు తీవ్ర అవమానం" అని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ల ద్వారా సమాఖ్య విలువలను అణచివేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. "ఇప్పటికే కర్ణాటకను సాంస్కృతికంగా, ఆర్థికంగా అణిచివేసిన బీజేపీ, ఇప్పుడు పాలనాపరంగా కూడా రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు రాజ్యాంగ వ్యతిరేక మార్గాన్ని తీసుకుంది. రాజ్యాంగ ఆకాంక్షలను దెబ్బతీస్తున్న బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు" అని ఖర్గే హెచ్చరించారు.

