
మలయాళం భాష బిల్–2025పై కర్ణాటక ఆందోళన
సరిహద్దు ప్రాంతాల్లో వివాదానికి దారితీసే అవకాశం ఉందన్న హోం మంత్రి పరమేశ్వర
కేరళ(Kerala) ప్రభుత్వం ప్రతిపాదించిన మలయాళం భాష(Malayalam Language) బిల్–2025 కర్ణాటక–కేరళ సరిహద్దు ప్రాంతాల్లో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉందని కర్ణాటక(Karnataka) హోంమంత్రి జి. పరమేశ్వర(Parameshwara) ఆందోళన వ్యక్తం చేశారు. భాషా అంశాలు అత్యంత సున్నితమైనవని, ఈ విషయంలో రెండు రాష్ట్రాలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మలయాళం భాషకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్ వల్ల సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న కన్నడ మాట్లాడే ప్రజల హక్కులకు భంగం కలగవచ్చని కర్ణాటక నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా కసరగోడ్ వంటి సరిహద్దు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కన్నడ ప్రజలు నివసిస్తున్నారని పరమేశ్వర గుర్తు చేశారు. దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ భాష ఆధారంగానే జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం తీసుకునే భాషా విధాన నిర్ణయాలు, పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపకుండా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బిల్లుతో సరిహద్దు ప్రాంతాల్లో భాషాపరమైన ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశాన్ని రాజకీయ రంగు పులుమకుండా పరిష్కరించాలని, కేరళ–కర్ణాటక ముఖ్యమంత్రులు పరస్పర చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని పరమేశ్వర సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న సరిహద్దు సమస్యలకు ఇది మరింత ఆజ్యం పోసే అవకాశం ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ బిల్ను ఆమోదించే ముందు అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కోరుతోంది. సరిహద్దు ప్రాంతాల్లోని కన్నడ మైనారిటీల భాషా హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రాలపై ఉందని నేతలు స్పష్టం చేస్తున్నారు.
కన్నడ మీడియం పాఠశాలలతో సహా అన్ని పాఠశాలల్లో మలయాళాన్ని తప్పనిసరి చేయడం వల్ల మైనారిటీలు నిర్వహించే సంస్థలు, సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు లేఖ రాశారు.
విస్తృత సంప్రదింపులు జరపాలని ఆయన కోరారు. బిల్లును రాజ్యాంగ మార్గాల ద్వారా అమలు చేస్తే కర్ణాటక వ్యతిరేకిస్తుందని అన్నారు.
మలయాళం భాష బిల్పై కొనసాగుతున్న ఈ పరిణామాలు, రాబోయే రోజుల్లో అంతర్రాష్ట్ర సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

