
కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..
సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన మద్రాస్ హై కోర్టు..
తమిళనాడు(Tamil Nadu)లోని తిరుపరంకుండ్రం(Thiruparankundram) కొండపై దీపం(Deepam) వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయ దేవస్థానం తప్పనిసరిగా దీపం వెలిగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రజా సమూహం లేకుండా ఆచారాన్ని నియంత్రిత పద్ధతిలో నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జి జయచంద్రన్, జస్టిస్ కెకె రామకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది.
ఇంతకు వివాదం ఏమిటంటే..
తిరుపరంకుండ్రం కొండ తమిళనాడులోని మధురైకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతనమైన పవిత్రకొండ. కొండపై సుబ్రమణ్యస్వామి ఆలయం చెక్కబడింది. దీన్ని భారత ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది. అయితే ఈ కొండపై ఇతర మతపరమైన కట్టడాలు కూడా ఉన్నాయి. దర్గా (మసీదు), జైన అవశేషాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. కార్తీక మాసంలో ఇక్కడి కొండపై దీపం వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం. అదే కొండపై సికందర్ బాదుషా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినదని, అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీల్లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కొండపై దర్గా ఉన్న కారణాన హిందూ మతపరమైన ఆచారంలో భక్తులకు దీపం వెలిగించే హక్కు ఉందా? అనే అంశంపై మత సంస్థలు, తమిళనాడు ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం సింగిల్ బెంచ్ తీర్పును విచారించిన ధర్మాసనం.. కొండపై దీపం వెలిగించడానికి ఆలయ దేవస్థానానికి అనుమతి ఇచ్చింది. ఆచార వ్యవహారాలను జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించింది. మొత్తానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ధర్మాసనం ముగింపు పలికింది.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి..
Madras HC upholds lighting of deepam at Thiruparankundram hilltop with curbs

