
‘‘పత్రాలను పరిశీలిస్తే టాస్మాక్ ఏదో తప్పు చేసినట్లే కనిపిస్తుంది’’
కీలక వ్యాఖ్యలు చేసిన మదురై హైకోర్టు బెంచ్, ఉద్యోగులపై క్రమ శిక్షణా చర్యలను నిలిపివేసిన కోర్టు
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) లో జరిగిన అవకతవకల గురించి మీడియాతో మాట్లాడిన ఉద్యోగులపై ఆ సంస్థ తీసుకున్న క్రమశిక్షణా చర్యలను మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ రద్దు చేసింది. జస్టిస్ బి ఫుగళేంది నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును సోమవారం విచారించింది.
‘‘అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలిస్తే మొత్తం టాస్మాక్ వ్యవస్థలో ఏదో తప్పు ఉందని స్పష్టంగా కనిపిస్తుంది’’ అని జస్టిస్ ఫుగళేంది విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అవినీతిని బయపెట్టినందుకు తమపై విధించిన శిక్షా చర్యలను సవాల్ చేస్తూ మదురైకి చెందిన ముగ్గురు టాస్మాక్ ఉద్యోగులు మాయకన్నన్, మురుగన్,రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
కేసు నేపథ్యం..
తమిళనాడు అంతటా దాదాపు ఏడువేల మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న గుత్తాధిపత్య సంస్థ టాస్మాక్, ఇది ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ విస్తృతమైన ఆర్థిక అవకతవకలు, అవినీతి ఆరోపణల తరువాత తీవ్ర పరిశీలనలకు గురైంది.
2014 నుంచి 2021 మధ్య తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ దాఖలు చేసిన 41 ప్రథమ సమాచార నివేదికల (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
ఈ ఎఫ్ఐఆర్ లో మద్యం ధరలను పెంచడం, టెండర్ ప్రక్రియలలో అవకతవకలు, డిస్టిలరీ కంపెనీల నుంచి ముడుపులు, సిబ్బంది బదిలీలు, బార్ లైసెన్స్ లకు సంబంధించిన అక్రమ చెల్లింపులు వంటి వాటికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
మదురై బెంచ్ తీర్పు..
ముగ్గురు టాస్మాక్ ఉద్యోగులు సంస్థలో జరుగుతున్న అవినీతి గురించి మీడియాతో మాట్లాడినందుకు క్రమశిక్షణా చర్యను ఎదుర్కొన్నారు. టాస్మాక్ తన కార్యకలాపాలలో అవినీతి కొనసాగడానికి అనుమతించదని చెబుతూ..ఆరోపణలు చేసిన మాయకన్నన్, మురుగన్, రామస్వామి పై చర్యతీసుకోవడాన్ని కోర్టు రద్దు చేసింది.
‘‘ మొత్తం టాస్మాక్ వ్యవస్థలో ఏదో తప్పు ఉంది’’ అని జస్టిస్ పుగళేంది అన్నారు. ఈ ఆరోపణలు సంస్థలోని వ్యవస్థాగత సమస్యల గురించి ఆందోళనలను చెబుతోంది. అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టడానికి ఉద్దేశించిన సంస్థలో అవినీతి అనుమతించడం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి అన్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
మే 14న తిరునల్వేలికి చెందిన న్యాయవాదీ కే. వేంకటాచలపతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లో అవినీతి ఎంత ఉందో పేర్కొంటూ స్వతంత్య దర్యాప్తు కోసం 41 డీవీఎసీ ఎఫ్ఐఆర్ లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి బదిలీ చేయాలని మద్రాస్ హైకోర్టు ను కోరారు.
ఈ ఎఫ్ఐఆర్ లపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని కోర్ట్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు పురోగతి స్పష్టం చేయాలని రాష్ట్రాన్ని కోరడంతో మే 23న ఈ దేశాన్ని పునరుద్ఘాటించారు.
సుప్రీంకోర్టులో టాస్మాక్ కు ఉపశమనం..
టాస్మాక్ పై ఈడీ చేస్తున్న దర్యాప్తు, సోదాలను సుప్రీంకోర్టు మే 22న నిలిపివేసింది. కేంద్ర సంస్థ అన్ని పరిమితులను దాటుతోందని పేర్కొంది. ‘‘మీ ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ విచారణ సందర్భంగా అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుతో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు దేశ సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు.
Next Story