
కేరళ తీరంలో మునిగిపోతున్న నౌక
కేరళ: కార్గోషిప్ నుంచి లీక్ అవుతున్న చమురు?
కోస్ట్ గార్డ్, నేవీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం
కేరళ తీరంలో ప్రమాదానికి గురై మునిగిపోయిన లైబీరియన్ కంటైనర్ షిప్ ఎంఎస్సీ ఎల్సా -3 నుంచి లీక్ అవుతున్న ఆయిల్ ను అరికట్టడానికి నావికాదళం, కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కంపెనీ సమన్వయంతో కూడిన చర్యలు విఫలమయినట్లు కోస్ట్ గార్డ్ ప్రకటించింది.
ఈ నౌక 640 కంటైనర్లను తీసుకెళ్తుండగా, వాటిలో ప్రమాదకరమైన 13 సరుకులు ఉన్నట్లు తేలింది. ఇందులో 12 కాల్షియం కార్బైడ్ ను తీసుకెళ్తున్నాయి. ఈ నౌకలో మెరైన్ గ్యాస్ ఆయిల్, వేరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్(వీఎల్ఎస్ఎఫ్ఓ)లను తీసుకెళ్తున్నట్లు కోస్ట్ గార్డ్ వెల్లడించింది.
‘‘ఓడ ట్యాంకుల్లో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ అయిల్ ఉంది’’ అని కోస్ట్ గార్డ్ తెలిపింది.
సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్..
కంటైనర్ మునిగిపోవడం ప్రారంభం కావడంతో 24 మంది సిబ్బందిని రక్షించారు. శనివారం సాయంత్రం 21 మందిని రక్షించారు. మిగిలిన ముగ్గురు కెప్టెన్, చీఫ్ ఇంజనీర్, రెండవ ఇంజనీర్ ను ఆదివారం ఉదయం ఓడ మునిగిపోతున్న సందర్భంలో రక్షించబడ్డారు.
రక్షించిన సిబ్బందిని కోస్ట్ గార్డ్ కార్యాలయానికి తరలించారు. సిబ్బందిలో ఒక రష్యన్, 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రేనియన్లు, ఒక జార్జియా జాతీయుడు ఉన్నారు.
1997 లో నిర్మించిన ఎస్ఎస్సీ ఎల్సా -3 శుక్రవారం విజింజం ఓడరేవు నుంచి కొచ్చికి బయలుదేరింది. 184 మీటర్ల పొడవున్న ఈ నౌక శనివారం మధ్యాహ్నం నుంచి స్టార్ బోర్డ్ వైపుకు దాదాపు 26 డిగ్రీలు, తీరం నుంచి 38 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది.
ఈ సంఘటన సమాచారం శనివారం మధ్యాహ్నం 1.25 గంటలకు భారత తీర రక్షక దళానికి అందింది. దీనితో భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుజాత, ఐసీజీఎస్ అర్న్వేష్, ఐసీజీఎస్ సాక్షం మూడు నౌకలు రక్షణ కార్యకలాపాల కోసం మోహరించారు.
చమురు ఆపడానికి చేసిన ప్రయత్నాలు..
సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటం వలన నౌకను కొచ్చి ఓడరేవుకు చేర్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోస్ట్ గార్డ్ పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు, లీక్ అవుతున్న చమురును అరికట్టడానికి కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది.
అనేక కంటైనర్లు సముద్రంలో పడి కేరళ తీరం వైపు, ముఖ్యంగా అలప్పుజా, ఎర్నాకుళం మధ్య కొట్టుకుపోతున్నాయి. ఒడ్డుకు కొట్టుకువచ్చే ఏ కంటైనర్లు సమీపించవద్దని లేదా తాకవద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కేరళ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కంటైనర్ నుంచి ప్రమాదకర పదార్థాలు విడుదల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
కేఎస్డీఎంఏ సలహా
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సాధారణ ప్రజలకు ఒక ప్రత్యేక సలహా జారీ చేసింది. ‘‘మునిగిపోయిన ఓడ నుంచి వచ్చినట్లు కనిపించే ఏవైనా వస్తువులు ఒడ్డుకు వచ్చినట్లు మీకు కనిపిస్తే దయచేసి వాటిని తాకవద్దు లేదా సమీపించవద్దు. వెంటనే 112 కు కాల్ చేయడం ద్వారా అధికారులకు తెలియజేయండి. కనీసం 200 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి’’ అని తెలిపింది.
గుంపులుగా ఉండవద్దని, అధికారులు వస్తువులను తొలగిస్తున్నప్పుడూ దయచేసి వారిని అడ్డుకోకండని తెలిపింది. కచ్చితమైన సురక్షితమైన దూరాన్ని పాటించాలని కోరింది.
పర్యావరణ నష్టాన్ని అరికట్టే ప్రయత్నాలు..
కాలుష్య ప్రతిస్పందన పరికరాలతో కూడిన సాక్షమ్ అనే నౌక, ఏదైనా చమురు లీక్ అయితే స్పందించడానికి సంఘటన స్థలంలో సిద్దంగా ఉందని కోస్ట్ గార్డ్ తెలిపింది.
కేరళలోని సున్నితమైన తీరం, జీవ వైవిధ్యానికి నిలయంగా ఉందని, ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అని పేర్కొంటూ కోస్ట్ గార్డ్ కాలుష్య ప్రతిస్పందన సంసిద్దతను, సాధ్యమయ్యే అన్ని పరిస్థితులకు రాష్ట్ర పరిపాలనతో సమన్వయాన్ని సిద్దం చేసిందని తెలిపింది.
చమురు లీకేజీని మ్యాపింగ్ చేయడానికి సాంకేతికత కలిగిన ఐసీజీ విమానం పరిస్థితిని అంచనా వేస్తోంది. ప్రస్తుతం చమురు లీకేజీ లేదు అని తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా స్పందించడానికి పూర్తిగా సిద్దంగా ఉన్నాయని, మునిగిపోయిన తరువాత పర్యావరణ ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని కోస్ట్ గార్డ్ తెలిపింది.
సహాయక చర్యల్లో భాగంగా మాతృసంస్థ నుంచి మరో నౌక ఆ ప్రాంతానికి చేరుకుందని డిఫెన్స్ పీఆర్ఓ తెలిపారు.
Next Story