
చిన్నకర గ్రామం
కర్ణాటక: దళితులపై బహిష్కరణ వేటు
గ్రామ పంచాయతీ భవన నిర్మాణ స్థలం విషయంలో వివాదం, రెండు వర్గాల మధ్య ఘర్షణ
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా గుర్మిత్కల్ తాలుకాలోని చిన్నకర గ్రామంలో కుల వివక్ష పడగ విప్పింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని కక్షతో దళిత సమాజాన్ని అగ్రవర్ణాల వారు సామాజికంగా బహిష్కరించారు.
2017 లో కర్ణాటక ప్రభుత్వం దళిత సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ కోసం చిన్నకరలో ఆరుగుంటల భూమిని కేటాయించింది. అయితే నిధుల కొరతతో భవనం మాత్రం నిర్మించలేదు.
అయితే ప్రస్తుతం ఇదే స్థలంలో గ్రామపంచాయతీ భవనం నిర్మించాలని స్థానికులు ప్రణాళిక రచించారు. జూన్ 20న అధికారులు, పంచాయతీ సభ్యులు జేసీబీ తో వచ్చి భూమిని చదును చేసి నిర్మాణం ప్రారంభించారు.
అయితే దీనికి దళితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఈ భూమి అంబేడ్కర్ భవన్ కోసం రిజర్వ్ చేయబడింది. ఇక్కడ వేరే భవనం నిర్మించకూడదు’’ అని ఆందోళన చేశారు. తరవాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ సమయంలో అగ్రవర్ణ వ్యక్తులు దళితులను కుల వివక్షతో దూషించారని దళిత నాయకుడు హుస్సేనప్ప ఆరోపించారు.
పోలీస్ ఫిర్యాదు.. బహిష్కరణ
అగ్రవర్ణాలు తమపై భౌతిక దాడి కుల ఆధారిత వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై దళితులు గుర్మిట్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత అగ్రవర్ణ సమాజం ఒక సమావేశం నిర్వహించిందని ఎవరూ దళితులతో మాట్లాడకూడదని నోటి మాటలతో ఆదేశం జారీ చేశారని గుర్తించారు. సామాజిక బహిష్కరణను అమలు చేస్తున్న పెద్దలతో మిగిలిన గ్రామస్థులు కూడా జత కలిశారు.
టీ ఇవ్వరు.. జుట్టు కత్తిరించరు..
ఈ బహిష్కరణ ఫలితంగా ఉన్నత కులాల వారు నడిపే స్థానిక హోటల్లో దళితులకు టీ నిరాకరిస్తున్నారు. సెలూన్ లో జుట్టు కత్తిరించడానికి నిరాకరిస్తున్నారు.
మాకు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు వారి నుంచి ఇలా సమాధానాలు వస్తున్నాయి. ‘‘ దళితులకు సేవలు అందించవద్దని మమ్మల్ని హెచ్చరించారు. అలా చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామంటున్నారు’’ అని చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్పులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అలాగే దళితులు పోషించుకునే గొర్రెలు, పశువుల మేతకు కూడా అగ్ర కులాల వారు సహకరించడం లేదు.
Next Story