అసెంబ్లీ ఎన్నికల్లో AIADMKతో జతకట్టనున్న DMDK..
దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగంకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చిన అన్నాడీఎంకే..
తమిళనాడులో 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఏఐఏడీఎంకే(AIADMK)కు డీఎండీకే మద్దతు ఇవ్వనుంది. అందుకు ప్రతిఫలంగా అన్నా డీఎంకే ఆ పార్టీకి 2026లో రాజ్యసభ సీటు ఇవ్వనుంది.
జూలై 24న తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అధికార పక్షం DMK నుంచి నలుగురిని, ప్రధాన ప్రతిపక్షం AIADMK నుంచి ఇద్దరిని తిరిగి పంపనున్నారు.
డీఎంకే రాజ్యసభ ఎంపీలు వీరే..
1) పి. విల్సన్: ఈయన సీనియర్ న్యాయవాది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయనను మళ్లీ నామినేట్ చేసి పార్టీ ప్రాతినిధ్యాన్ని కొనసాగించింది డీఎంకే.
2) ఎస్.ఆర్. శివలింగం: మాజీ ఎమ్మెల్యే అయిన సేలం తూర్పు జిల్లా కార్యదర్శి కూడా. సేలం ప్రాంతంలో బలమైన వ్యక్తిగా పేరున్న మాజీ మంత్రి వీరపాండియన్ అనుచరుడు. శివలింగం ఉదయార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సామాజికవర్గం ఓట్లు కలిసివస్తాయని డీఎంకే భావిస్తోంది.
3) రచయిత్రి కవింగర్ సల్మా: ఈమె ప్రఖ్యాత తమిళ కవయిత్రి. మేథావులు, కళాకారుల ఓట్లను రాబట్టుకునేందుకు ఈమెను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.
హామీ నిలబెట్టుకున్న డీఎంకే..
4)ఇక MDMK నేత వైకో స్థానంలో MDMK (మారుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం) చీఫ్ కమల్ హాసన్ వెళ్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే అద్భుతమైన విజయం సాధించింది. భారత కూటమిలో భాగమైన డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులోని మొత్తం 39 స్థానాలను, పుదుచ్చేరిలోని ఏకైక స్థానాన్ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలో మక్కల్ నీది మలమ్ (MNM) పోటీచేయకపోగా డీఎంకే కూటమి తరుపున విస్తృత ప్రచారం చేసింది. అందుకు ప్రతిఫలంగా 2025లో రాజ్యసభ సీటు ఇస్తామని కమల్కు డీఎంకే హామీ ఇచ్చింది.
వైకోను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయకపోవడంతో MDMK డీఎంకేతో గతంలోలాగా కలిసి ఉంటారా? లేక విడిపోతుందా? అన్న సందేహం తలెత్తింది. ఈ విషయంపై ఆ పార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పార్టీ వ్యవస్థాపకుడు వైకో కుమారుడు దురై వైకో స్పష్టతనిచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలోనూ అధికార డీఎంకేతో తమ పొత్తు కొనసాతుతుందని ధృవీకరించారు.
అన్నాడీఎంకే నుంచి ఇద్దరు ఎవరంటే..
అన్నాడీఎంకే ఆదివారం రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అడ్వకేట్ వింగ్ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు, ఐఎస్ ఇంబాదురై, ఎఐఎడిఎంకె చెంగల్పేట్-తూర్పు జిల్లా పార్టీ ప్రెసిడియం చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎం ధనపాల్లను నామినేట్ చేస్తున్నట్లు ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రకటించారు.