
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై సీఎం స్టాలిన్ సీరియస్..
జాతీయ విద్యా విధానం (NEP) అమలుపై కేంద్రానికి, తమిళనాడు(Tamil nadu) డీఎంకే (DMK) సర్కారుకు మధ్య ముదిరిన మాటల యుద్ధం..
త్రి భాషా విధానం అమలు చేయాలని కేంద్రం పట్టుబడుతోంది. ఇందుకు తమిళనాడు సర్కారు ససేమిరా అంటోంది. రోజులు గడిచేకొద్దీ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan), సీఎం స్టాలిన్(MK Stalin)కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. NEPని, PM SHRI పథకాన్ని తిరస్కరించడం ద్వారా తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రధాన్కు అహంకార ధోరణి తగదన్నారు. జాతీయ విద్యా విధానంపై తమిళ ప్రజల అభిప్రాయాన్ని తక్కువగా అంచనా వేసి, అవమానించొద్దని హితవు పలికారు. తమిళనాడుకు విద్యా నిధుల కేటాయింపుపై ప్రశ్నించిన ఎంపీలను ధర్మేంధ్ర ప్రధాన్ “అనాగరికులు” అనడాన్ని ప్రధాని మోదీ సమర్థిస్తారా?” అని ప్రశ్నించారు. ‘‘మేము కేంద్రం ఒత్తిడికి తలొగ్గం. నాగపూర్ ఆదేశాలకు లోబడి పనిచేసే మనస్తత్వం మాది కాదు,” అంటూ ప్రధాన్ను విమర్శించారు.
ప్రధాన్ PM SHRI పథకం అమలుకు తొలుత డీఎంకే ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీలు నిరసన తెలపడంతో లోక్సభ తాత్కాలికంగా వాయిదా పడింది.