
ఢిల్లీ మహిళలకు ఉచిత పింక్ మొబిలిటీ కార్డు
పింక్, బ్లూ, ఆరెంజ్ కార్డులు.. పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బస్సులు, మెట్రోతో పాటు ఇతర రవాణా సేవలను సులభతరం చేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC)ను తీసుకొచ్చింది."సశక్త్ నారి, సమృద్ధ్ ఢిల్లీ" పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ పథకం కింద మూడు రకాల కార్డులు అందుబాటులోకి రానున్నాయి. బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అర్హులైన మహిళలకు పింక్ కార్డు ఇస్తారు. సాధారణ ప్రయాణికులకు నీలం కార్డు ఇవ్వనున్నారు. నెలవారీ పాసుల కోసం ఆరెంజ్ కార్డు ఇస్తారు. ప్రస్తుతానికి పింక్, నీలం కార్డు ఇవ్వనున్నారు. ఈ కార్డులను ఇచ్చే బాధ్యతను హిండన్ మర్కంటైల్ లిమిటెడ్ (ముఫిన్పే), ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అప్పగించింది. జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయాలు, ఎంపిక చేసిన DTC కేంద్రాల్లో ఈ కార్డులు తీసుకోవచ్చు. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా రెండు ఉచిత LPG సిలిండర్లను కూడా ఢిల్లీ ప్రభుత్వం అందజేయనుంది.

