
ప్రధాని మోదీ 'చాయ్వాలా' వీడియోపై దుమారం
కాంగ్రెస్ దురుసు మనస్తత్వానికి ఈ వీడియో నిదర్శనం అని పేర్కొన్న బీజేపీ సీనియర్ నేత సీఆర్ కేశవన్..
పార్లమెంట్(Parliament) శీతాకాల సమావేశాలు జరుగుతోన్న తరుణంలో ప్రధాని మోదీ ‘చాయ్వాలా’ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (A.I) సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన 6 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్(Ragini Nayak) తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పోస్టు చేశారు. మోదీ(PM Modi) లేత నీలం రంగు కోటు, నల్లటి ప్యాంటు ధరించి, కుడి చేతిలో కేట్లీ, ఎడమ చేతిలో టీ గ్లాసులు పట్టుకుని ‘‘చాయ్.. చాయ్ బోలో చాయ్..’’ అంటూ నడుచుకుంటూ వెళ్తు్న్న వీడియో నెట్టింట్లో వైరలైంది. ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
अब ई कौन किया बे 🥴🤣 pic.twitter.com/mbVsykXEgm
— Dr. Ragini Nayak (@NayakRagini) December 2, 2025
BJP సీనియర్ నాయకుడు సీఆర్ కేశవన్.. ‘‘ఇది దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు జరిగిన అవమానం" అని పేర్కొన్నారు. ఓబీసీ సమాజంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్(Congress) దురుసు మనస్తత్వానికి ఈ వీడియో నిదర్శనం అని మండిపడ్డారు. మోదీ అంకితభావం, ఎదుగుదలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు ఓటర్లే సమాధానం చెబుతారని అన్నారు.
మోదీ మూలాలను ఎగతాళి చేయడం సబబు కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా అన్నారు. బీహార్ ఎన్నికల సమయంలోనూ ఆయన తల్లిని లక్ష్యంగా చేసుకుని అవమానించారని గుర్తు చేశారు. చివరికి ఓటర్లు ఆ పార్టీని ఎలా శిక్షించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

