
రేపటి నుంచి ఒడిశా పూరీ జగనాథ్ రథయాత్ర..
కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ 12 రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలు..
దేశంలో చాలా గొప్పగా జరిగే పూరీ(Puri) జగన్నాథ(Jagannath Rath Yatra) రథయాత్ర రేపటి నుంచి (జూన్ 27)నుంచి ప్రారంభం కానుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు. 12 రోజుల పాటు జరిగే ఈ రథయాత్రకు భద్రత(Security) ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు. సుమారు 10వేల మంది పోలీసులతో పాటు BSF, CRPF, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)బలగాలను విధుల్లో ఉంచనున్నారు. పూరీ పట్టణంలోని వివిధ ప్రదేశాలలో 275 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే సీసీ కెమెరాలను అమర్చారు. ఏఐ-ఆధారిత నిఘా వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ సమస్య, భక్తుల పెరుగుదలను తెలుసుకోవచ్చని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) వైబి ఖురానియా తెలిపారు. కీలక ప్రదేశాలలో సబ్-కంట్రోల్ రూములను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. పట్టణాన్ని ఎనిమిది జోన్లుగా విభజించి పోలీసులకు విధులు కేటాయించామని వివరించారు.
రథోత్సవం మొదటి, రెండో రోజు సుమారు 15 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. ఈ సంవత్సరం పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రథయాత్ర జరుగుతుండడంతో పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రథయాత్ర జూలై 8న ముగుస్తుంది.
భక్తుల దగ్గరకు భగవంతుడు..
సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపునకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కానీ పూరి జగన్నాధుని ఆలయంలో మాత్రం జగన్నాథుని రథయాత్రలో మాత్రం జగన్నాథ స్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడి నుంచి బయటికి వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథ యాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.
ఏటా కొత్త రథం
సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కానీ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను తయారుచేస్తారు.