
ఆ రెండు బిల్లులను ఓకే చేసిన ఒడిశా అసెంబ్లీ
ఒడిశా విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు - 2024, ఒడిశా రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు - 2025
ఒడిశా శాసనసభ (Odisha Assembly) రెండు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. ఒడిశా విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు - 2024(The Odisha Universities (Amendment) Bill, 2024), ఒడిశా రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు- 2025కు ఆమోదం లభించింది.
ఈ రెండు బిల్లులపై శాసనసభలో బుధవారం సాయంత్రం 4 గంటలకు చర్చ ప్రారంభమైంది. దాదాపు 12 గంటల పాటు చర్చ కొనసాగింది. చివరకు తెల్లవారుజామున ఉదయం 4.29 గంటలకు ఆమోదం లభించింది. అంతవరకు సీఎం మోహన్ చరణ్ మాఝీ, డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా, మంత్రులు సభలోనే ఉన్నారు.
8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్పి స్వైన్, మాజీ మంత్రులు అరుణ్ కుమార్ సాహూ, గణేశ్వర్ బెహెరా, ప్రతిపక్ష చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ సహా బీజేడీకి చెందిన సీనియర్ శాసనసభ్యులు చర్యలో పాల్గొన్నారు.
చర్చ సందర్భంగా సభలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం జరిగింది. యూనివర్సిటీ బిల్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున సెలెక్ట్ కమిటీకి నివేదించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఉన్నత విద్యా మంత్రి సూర్యబన్షి సూరజ్ ప్రతిపక్షాల ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫలితంగా బిల్లు మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది.
మాజీ ఉన్నత విద్యా మంత్రి, బీజేడీకి చెందిన అరుణ్ కుమార్ సాహూ గంటకు పైగా ప్రసంగించారు. గత ప్రభుత్వం 2020లో విశ్వవిద్యాలయాల బిల్లుకు సవరణను ఆమోదించిందని, దీన్ని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) ఒరిస్సా హైకోర్టులో సవాలు చేసిందని గుర్తుచేశారు. బిల్లును హైకోర్టు సమర్థించిన తర్వాత.. యూజీసీ మళ్ళీ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో అది అక్కడ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.
ఆ తర్వాత న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ప్రవేశపెట్టిన 'ది ఒడిశా స్టేట్ హైవేస్ అథారిటీ బిల్లు 2025(Odisha State Highway Authority Bill)'పై సుమారు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఆ తర్వాత బిల్లును వాయిస్ ఓటు ద్వారా ఆమోదం లభించింది. "రాష్ట్రంలో 75,000 కి.మీ మేర రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు భూసేకరణ, పునరావాసం, పర్యావరణం, అటవీ అనుమతులు అవసరం." అని మంత్రి అన్నారు. ఒడిశా రాష్ట్ర రహదారుల అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తరహాలో ఉంటుందని, రహదారులు, ప్రధాన రహదారుల ప్రణాళిక, అభివృద్ధి, నిర్వహణకు బాధ్యత వహిస్తుందని హరిచందన్ వివరించారు.