
బీహార్ లో గెలుపు ఎవరిదీ? మరికొద్ది గంటల్లో ఫలితం!
243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొద్దిసేపట్లో మొదలు కానుంది. ఏ కూటమి గెలుస్తుందన్నది ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13శాతం పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో 57.29 శాతం ఓటింగ్ జరిగింది. పది శాతం అధికంగా పోలింగ్ నమోదు కావడంతో.. విజయంపై పాలక ఎన్డీఏ, విపక్ష మహాగఠ్బంధన్ ధీమాతో ఉన్నాయి.
2,616 మంది అభ్యర్థులు పోటీచేయగా.. సుమారు 7.45 కోట్ల మంది ఓటర్లలో 67.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బిహార్ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది.
1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
అభివృద్ధి కావాలా? ఆటవిక పాలనా? అంటూ ఎన్డీయే ప్రచార పర్వం కొనసాగించగా.. ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాగఠ్బంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉత్కంఠగా కొనసాగిన బిహార్ ఎన్నికల సమరంలో శుక్రవారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పలు కీలక అంశాలను ఓసారి పరిశీలిస్తే..!
బిహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్
అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు (మ్యాజిక్ ఫిగర్): 122
మొత్తం ఓటర్ల సంఖ్య: 7.45 కోట్లు (పురుషులు 3.92 కోట్ల మంది, మహిళలు 3.50 కోట్ల మంది)
రెండు విడతల్లో ఎన్నికలు సాగాయి.
పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది ఓటేశారు.
తొలి దశ పోలింగ్: నవంబరు 6; స్థానాలు: 121;
ఓటర్లు: 3.75 కోట్ల మంది; బరిలో నిలిచిన అభ్యర్థులు: 1314 మంది, నమోదైన పోలింగ్ శాతం: 65+
రెండో దశ: నవంబరు 11; సీట్లు: 122
ఓటర్లు: 3.70 కోట్ల మంది; అభ్యర్థులు: 1302; పోలింగ్ శాతం 69+
ఎన్నికల్లో ప్రధాన అంశాలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీ ఆరోపణలు, నిరుద్యోగం, వలసలు, అవినీతి, అభివృద్ధిలో వెనుకబాటు, శాంతిభద్రతలు
కూటముల వారీగా పోటీ
ఎన్డీయే: జేడీయూ (101); బీజేపీ (101); లోక్ జన్శక్తి (రాంవిలాస్) (28); హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) (06); రాష్ట్రీయ లోక్మోర్చా (ఆర్ఎల్ఎం) (06) స్థానాల్లో పోటీ చేశాయి.
మఢౌరాలో లోక్జన్శక్తి (రాంవిలాస్) అభ్యర్థి సీమా సింగ్ నామినేషన్ తిరస్కరించారు.
దీంతో స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్కు ఎన్డీయే మద్దతు ప్రకటించింది.
మహాగఠ్బంధన్:
ఆర్జేడీ (143); కాంగ్రెస్ (61); సీపీఐ(ఎంఎల్)ఎల్ (20); వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (12); సీపీఐ (09); సీపీఎం (04); ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ (03); జనశక్తి జనతాదళ్ (01); స్వతంత్రులు (02) (కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీ ఉంది)
ఇతరులు: జన్ సురాజ్ పార్టీ (238); బీఎస్పీ (130); ఆప్ (121); ఏఐఎంఐఎం (25); రాష్ట్రీయ లోక్జనశక్తి (25); ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) (25) తదితర పార్టీలు బరిలో ఉన్నాయి.
ప్రధాన హమీలు....
ఎన్డీయే కూటమి: ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నీతీశ్ సుపరిపాలన, డబుల్ ఇంజిన్ సర్కారు తదితర అంశాలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేసింది. లాలూ హయాంలో జంగల్రాజ్ నెలకొందని, అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. విపక్ష కూటమిని ఎండగట్టింది.
యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, కోటి మంది మహిళలను ‘లఖ్పతి దీదీ’లుగా మార్చడం, ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు.
మహాగఠ్బంధన్: ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపై దృష్టిసారించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్), ఓట్ల చోరీ, నీతీశ్ సర్కారుపై వ్యతిరేకత, వలసలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలచుకుంది.
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీలు ప్రకటించింది.
కీలక నేతలు.. స్థానాలివే..
తేజస్వీ యాదవ్- ఆర్జేడీ (రాఘోపుర్); సామ్రాట్ చౌదరీ- బీజేపీ (తారాపుర్); విజయ్ కుమార్ సిన్హా- బీజేపీ (లఖిసరాయ్); మైథిలీ ఠాకుర్- బీజేపీ (అలీనగర్); ప్రేమ్ కుమార్ - బీజేపీ (గయా టౌన్); తేజ్ప్రతాప్ యాదవ్- జేజేడీ (మహువా); బిజేంద్ర ప్రసాద్ యాదవ్- జేడీయూ (సుపౌల్); తార్కిశోర్ ప్రసాద్- బీజేపీ (కఠిహార్); రాజేశ్ కుమార్ - కాంగ్రెస్ (కుటుంబ)
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బీహార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన ఇలా ప్రచారం చేయడం ఇదే తొలిసారి.
Next Story

