పాఠ్యపుస్తకాలలో ‘బాబ్రీ’ పదం కట్: బదులుగా ఏం వాడారంటే..
x

పాఠ్యపుస్తకాలలో ‘బాబ్రీ’ పదం కట్: బదులుగా ఏం వాడారంటే..

ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో అయోధ్య రామమందిరం పాఠాలకు సంబంధించి కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా పుస్తకాల్లో బాబ్రీ మసీదు అనే పదాన్ని తొలగించారు.


అయోధ్య రామమందిరం నిర్మాణం తరువాత చరిత్ర పుస్తకాల్లో కూడా మార్పులకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించినట్లు కనిపిస్తోంది. తాజాగా 12 వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల్లో అంతకుముందు ఉన్న అయోధ్య విభాగం అనే చాప్టర్ ను 4 నుంచి 2 పేజీలకు తగ్గించింది.

గతవారం మార్కెట్ లో విడుదల అయిన ఈ పుస్తకం నుంచి బాబ్రీ మసీదు పేరును పూర్తిగా తొలగించింది. దాని బదులుగా మూడు గోపురాల నిర్మాణం అని సంబోధించింది. అలాగే మునుపటి ఎడిషన్ కు సంబంధించి ఎలాంటి వివరాలు కూడా ప్రస్తుత ఎడిషన్ లో పొందుపరచలేదని ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.

అలాగే ప్రస్తుత ఎడిషన్ లో గుజరాత్ లోని సోమ్ నాథ్ నుంచి అయోధ్య వరకూ బీజేపీ చేపట్టిన బీజేపీ రథయాత్ర, కర సేవకుల పాత్ర, డిసెంబర్ 6, 1992 లో జరిగిన బాబ్రీ మసీద్ కూల్చివేత, ఆ తరువాత జరిగిన మత హింస, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తీసివేసి రాష్ట్రపతి పాలన వంటివి కూడా తొలగించారు.
'మూడు గోపురాల నిర్మాణం'
పాత పాఠ్యపుస్తకంలో బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ జనరల్ మీర్ బాకీ నిర్మించిన మసీదుగా పరిచయం చేయగా, కొత్త పుస్తకంలో దీనిని "మూడు గోపురాల" నిర్మాణం చేశారని, అది శ్రీ రాముడి జన్మస్థలంగా చెప్పింది. ఈ మూడు గోపురాల నిర్మాణంలో హిందూ చిహ్నాలు, ఇతర అవశేషాలు కనిపించాయని వెల్లడించింది. దీనిని 1528లో నిర్మించినట్లు తెలిపింది.
అయోధ్య జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1986లో మసీదు తాళాలు తెరిచిన తర్వాత పాత పాఠ్యపుస్తకం "రెండు వైపులా" సమీకరణ వివరాలను కూడా ఇచ్చింది. మతపరమైన ఉద్రిక్తతలు, సోమనాథ్ నుంచి అయోధ్య వరకు నిర్వహించిన రథయాత్ర, రామ మందిరాన్ని నిర్మించడానికి డిసెంబర్ 1992లో వాలంటీర్లు చేపట్టిన కరసేవ, మసీదు కూల్చివేత, జనవరి 1993లో జరిగిన మత హింసను ఇది ప్రస్తావించింది. "అయోధ్యలో జరిగిన సంఘటనలపై విచారం" వ్యక్తం చేస్తూనే, "లౌకికవాదంపై తీవ్రమైన చర్చ" గురించి ప్రస్తావించారు.
ఈ సమాచారం మొత్తాన్ని తాజాగా ఒక పేరాగ్రాఫ్ లో పొందుపరిచారు. దీని ప్రకారం అప్పటి ఫైజాబాద్ జిల్లా కోర్టు తీర్పు చెబుతూ.. 1986 లో అక్కడి నిర్మాణాలను అన్ లాక్ చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం మూడు గోపురాల నిర్మాణంలో హిందూవులు పూజ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఒక ఆలయాన్ని కూల్చివేసి మూడు గోపురాల నిర్మాణం చేపట్టారని, ఈ స్థలం శ్రీరాముడి జన్మస్థలమని హిందూ సమాజం భావించింది. తమ ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా హిందూ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముస్లిం సమాజం మాత్రం నిర్మాణం మాకు అప్పజెప్పాలని కోరింది. తదనంతరం, యాజమాన్య హక్కులపై రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి, ఫలితంగా అనేక వివాదాలు, చట్టపరమైన వైరుధ్యాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు న్యాయమైన పరిష్కారం కావాలని రెండు సంఘాలు కోరుకున్నాయి. 1992లో, నిర్మాణాన్ని కూల్చివేసిన తరువాత, కొంతమంది విమర్శకులు ఇది భారత ప్రజాస్వామ్య సూత్రాలకు గణనీయమైన సవాలును అందించిందని వాదించారు.
ప్రధాన మార్పులు
అంతేకాకుండా, అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు నిర్ణయంపై సబ్ సెక్షన్ ('చట్టపరమైన విచారణల నుంచి సామరస్యపూర్వక అంగీకారం' అనే శీర్షికతో) పాఠ్యపుస్తకం కొత్త వెర్షన్‌లో రోజువారీ వివారలు జత చేశారు. బహుళ ప్రజాస్వామ్య సమాజంలో విభేదాలు సాధారణంగా న్యాయప్రక్రియను అనుసరించి పరిష్కరించబడతాయి. అయోధ్య వివాదంపై నవంబర్ 9, 2019న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజారిటీతో తీర్పును వెలువరించింది. ఆ తీర్పు ఆలయా నిర్మాణానికి నాందీ పలికింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అయోధ్య రామాలయం ప్రారంభం అయింది.
“తీర్పును అనుసరించి రామమందిర నిర్మాణం కోసం వివాదాస్పద స్థలాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు కేటాయించింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని సంబంధిత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విధంగా, ప్రజాస్వామ్యం మనలాంటి బహుళ సమాజంలో సంఘర్షణ పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది. రాజ్యాంగ సమగ్ర స్ఫూర్తిని ఈ తీర్పు సమర్థిస్తుంది.
ఈ సమస్య పురావస్తు త్రవ్వకాలు, చారిత్రక రికార్డుల వంటి సాక్ష్యాల ఆధారంగా న్యాయ ప్రక్రియను అనుసరించి పరిష్కరించబడింది. సుప్రీంకోర్టు తీర్పుపై సమాజం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. భారతదేశంలో నాగరికంగా పాతుకుపోయిన ప్రజాస్వామ్య పరిపక్వతను చూపించే నిదర్శం ఈ తీర్పు. సున్నితమైన సమస్యపై ఏకాభిప్రాయం రావడం అనేది ఒక అద్భుతమైన ఉదాహరణ, ”అని పాఠ్యపుస్తకం పేర్కొంది.
పాత పాఠ్యపుస్తకంలో "బాబ్రీ మసీదు కూల్చివేత, కళ్యాణ్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది" అనే శీర్షికతో డిసెంబర్ 7, 1992 నాటి వార్తాపత్రిక కథనాల చిత్రాలు ఉండేవి. డిసెంబరు 13, 1992 నుంచి వచ్చిన మరొక శీర్షిక, మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయిని ఉటంకిస్తూ "అయోధ్య బిజెపి తప్పుడు లెక్కలు" అని పేర్కొంది. అన్ని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు ఇప్పుడు తొలగించబడ్డాయి.
కోర్టు పరిశీలనలు
పాత పుస్తకంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వెంకటాచలయ్య, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జిఎన్ రే ఇచ్చిన తీర్పులోని పరిశీలనల నుంచి తీసుకున్న ఒక సారాంశం ఉంది. ఇందులో వివిధ కేసులను ప్రస్తావించారు. కొత్త పుస్తకంలో ఇంకా న్యాయమూర్తుల గురించి కూడా పలు సారాంశాలను భర్తీ చేశారు. నవంబర్ 9, 2019 నాటి సుప్రీం కోర్టు తీర్పు సారాంశాన్ని కూడా జత చేశారు. “...ఈ కోర్టులోని ప్రతి న్యాయమూర్తి కేవలం పని చేయడమే కాదు, రాజ్యాంగం, దాని విలువలను సమర్థిస్తానని ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ‘‘ఒక మతం, మరొక మతం’’ ‘‘విశ్వాసం లేదా మరో విశ్వాసం’’ మధ్య తేడాను చూపలేదు. అన్ని రకాల విశ్వాసాలు, ఆరాధనలు, ప్రార్థనలు రాజ్యాంగం ముందు సమానం. ఈ వివాదం ఇలా ముగిసింది. మసీదు నిర్మాణానికి పూర్వం ఇక్కడ రాముడి ఆలయం ఉండేదని డాక్యుమెంటరీ, మౌఖిక ఆధారాల ద్వారా నిరూపించబడింది.
నాల్గవ రౌండ్
ఇది 2014 నుంచి NCERT పాఠ్యపుస్తకాల మారడం ఇది నాలుగో సారి. 2017 లో మొదటి రౌండ్ లో, 2018 లో సిలబస్ భారాన్ని తగ్గించడానికి, తరువాత కోవిడ్ కారణంతో పాఠ్య పుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించింది. తాజాగా అయోధ్య తో నాలుగోసారి పాఠాలను కాలానికి అనుగుణంగా మార్చింది.
అయోధ్యపై విభాగంలో మార్పులను ప్రస్తావిస్తూ, NCERT ఏప్రిల్‌లో ఓ ప్రకటన జారీ చేసింది “రాజకీయాల్లో తాజా పరిణామాలకు అనుగుణంగా కంటెంట్ నవీకరించబడింది. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ద్వారా తాజా మార్పులు, విస్తృతమైన స్వాగత ఆదరణ కారణంగా అయోధ్య సమస్యపై పాఠం పూర్తిగా సవరించబడిందని వెల్లడించింది.



Read More
Next Story