న్యూఢిల్లీలో బాంబు పేలుడు, 8 మంది మృతి
x

న్యూఢిల్లీలో బాంబు పేలుడు, 8 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.


దేశ రాజధాని ఢిల్లీ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు. పది కార్లకు పైగా దగ్ధం అయ్యాయి. ఐదు కార్లు ఓమోస్తరుగా దెబ్బతిన్నాయి.

అక్టోబర్ 10వ తేదీ సోమవారం రాత్రి 6.55 గంటల ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ 1వ గేటు వద్ద కారు బాంబు పేలింది. మారుతీ ఎకో కారులో పేలుడు జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్‌ టీమ్‌, ఎన్‌ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
మాటల్లో వర్ణించలేని భయోత్పాతం...
భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కలే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. మారుతీ ఎకో కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
పేలుడు నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.
ఈ పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఈ ఉదయం భారీగా పేలుడు సామగ్రి పట్టుబడటం.. సాయంత్రమే దిల్లీలోని ఎర్రకోట సమీపంలోని కారులో భారీ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, హరియాణా, యూపీలను కలిపే అన్ని సరిహద్దు పాయింట్ల వద్ద పోలీసు నిఘాను పెంచారు. రైల్వే స్టేషన్లు, మెట్రోస్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్పెషల్‌ సెల్‌, క్రైం బ్రాంచ్‌ సహా అన్ని విభాగాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు. దిల్లీ- హరియాణా సరిహద్దు సమీపంలో వాహనాలు, లాడ్జీలను తనిఖీ చేయాలని బృందాలను ఆదేశించినట్లు తెలిపారు.
తనికీలు ముమ్మరం అయ్యాయి. ఒకర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Read More
Next Story