నిమిషాకు ఉరి శిక్ష..తప్పించేందుకు ఫ్యామిలీ చేస్తున్న ప్రయత్నమేంటి?
x

నిమిషాకు ఉరి శిక్ష..తప్పించేందుకు ఫ్యామిలీ చేస్తున్న ప్రయత్నమేంటి?

2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న నిమిషాను కోర్టు దోషిగా తేల్చింది. మరణశిక్ష విధించింది. కుటుంబసభ్యులు ఆమెను కాపాడుకోడానికి ‘బ్లడ్ మనీ’కి సిద్ధమయ్యారు.


కేరళ(Kerala)కు చెందిన నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)ను మరో 4 రోజుల్లో ఉరితీయనున్నారు. యెమెన్ దేశ పౌరుడిని హత్య చేసినందుకు ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. యెమెన్ దేశాధ్యక్షుడు కూడా కోర్టు తీర్పును సమర్థించారు. ఈ నేపథ్యంలో నిమిషా కుటుంబసభ్యులు హతుడి కుటుంబానికి ‘బ్లడ్ మనీ’గా 1 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. హత్య కేసుల్లో బాధిత కుటుంబం బ్లడ్ మనీ(Blood money) కింద కొంత పరిహారాన్ని నిందితుల నుంచి స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే మరణ శిక్ష రద్దయే అవకాశం ఉంది. అక్కడి చట్టాలు ఇందుకు అంగీకరిస్తాయి.


అసలేం జరిగింది?

కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసింది. 2008లో నర్సుగా పని చేయడానికి యెమెన్ దేశానికి వెళ్లింది. కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసిన అనుభవంతో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించాలనుకుంది. యెమెన్ నిబంధనల ప్రకారం విదేశీయులు క్లినిక్ తెరవడానికి వీల్లేదు. స్థానికుల భాగస్వామ్యంతో క్లినిక్ నడపవచ్చని తెలుసుకున్న నిమిషా.. తన బిజినెస్ పార్ట్‌నర్‌గా తలాల్ అబ్దోను ఎంచుకుంది. అప్పటికే నిమిషాకు పెళై కూతురు కూడా ఉంది. కూతురి బాప్టిజం కార్యక్రమానికి నిమిషాతో అబ్దో కేరళకు వచ్చాడు. ఇంట్లో ఉన్న నిమిషా పెళ్లి నాటి ఫొటోలు దొంగిలించిన అబ్దో.. యెమన్‌లో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేయించి నిమిషాను తన భార్య అని చెప్పకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్దో జైలు పాలయ్యాడు. విడుదలై వచ్చాక నిమిషాను వేధించటం మొదలెట్టాడు. క్లినిక్ ద్వారా వచ్చే డబ్బును బలవంతంగా తీసుకెళ్లేవాడు. తన వేధింపులకు భరించలేక కేరళకు వెళ్లిపోతుందేమోనని ఆమె పాస్ పోర్టును కూడా తన వద్దే ఉంచుకున్నాడు. అబ్దో వేధింపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్న నిమిషా ఓ ప్లాన్ వేసింది. మత్తు మందు ఇచ్చి తన పాస్ పోర్టు తీసుకుని కేరళ వెళ్లిపోవాలనుకుంది. ప్లాన్‌లో భాగంగా అబ్దోకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. డోస్ ఎక్కువకావడంతో అబ్దో చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో మత్తుమందు ఇవ్వడం వల్లే మృతిచెందాడని నిర్ధారణ కావడంతో నిమిషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది. తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది.


‘బ్లడ్ మనీ’కి సిద్ధమైన నిమిషా ఫ్యామిలీ..

నిమిషాను కాపాడుకోడానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి సిద్ధమైంది. నిమిషా కుటుంబానికి పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న సమీల్ జెరోమ్ ఇప్పటికే యెమెన్‌లోని సనాలో ఉన్నారని, ఆయన అబ్దో కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నాడని సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కార్యకర్త బాబు జాన్ తెలిపారు. నిమిషాను ఉరిశిక్ష నుంచి కాపాడుకోడానికి మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ ఇచ్చేందుకు నిమిషా కుటుంబం సిద్ధంగా ఉందని, అయితే అబ్దో కుటుంబం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాబు జాన్ చెప్పారు. ఆ డబ్బును స్వీకరించి అబ్దో కుటుంబసభ్యులు నిమిషాకు క్షమాభిక్ష పెట్టడం తప్ప మరో మార్గం లేదని ఆయన అంటున్నారు.

Read More
Next Story