కోవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల
x

కోవిడ్ కేసుల్లో స్వల్ప పెరుగుదల

ఆందోళన అవసరం లేదంటున్న వైద్య నిపుణులు..


విదేశాల్లో కోవిడ్ దడ మొదలైంది. హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్‌లో కోవిడ్ (COVID) కేసులు పెరుగుతున్నాయి. ఇటు భారత్‌లోనూ ఒక మోస్తరుగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల విషయానికొస్తే కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో అత్యధిక కేసులు రికార్డవుతున్నాయి. ఇప్పటివరకు కొత్త వైరస్ వేరియంట్లేవీ బయటపడకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

భారత్ COVID డాష్‌బోర్డ్‌‌లో మాత్రం వివిధ రాష్ట్రాలలో మొత్తం 257 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు చూపారు. వీటిల్లో కేరళలో అత్యధికంగా 95 కేసులు, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56 కేసులున్నాయి. కర్ణాటకలో 13 యాక్టివ్ కేసులు, పుదుచ్చేరిలో 10, గుజరాత్‌లో 7, రాజస్థాన్‌లో 2, సిక్కిం, హర్యానా, పశ్చిమ బెంగాల్‌లో ఒకటి చొప్పున నమోదయ్యాయి.

కేసుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు ఈ వారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత కేసుల సంఖ్యను తక్కువేనని, ప్రస్తుతానికి దేశంలో కోవిడ్ నియంత్రణలోనే ఉందని వారు పేర్కొన్నారు.

కేరళలో అత్యధికంగా..

దేశంలో అత్యధికంగా 95 యాక్టివ్ కేసులున్న కేరళ(Kerala) రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి రాష్ట్ర స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీం (RRT) సమావేశాన్ని ఏర్పాటుచేసింది. మే నెలలో కేరళలో మొత్తం 182 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 57 కేసులు కొట్టాయం జిల్లా నుంచి, 34 ఎర్నాకులం నుంచి, 30 కేసులు తిరువనంతపురం నుంచి వచ్చాయి.

‘ప్రమాదకరమైనవి కావు..’

"ఆగ్నేయాసియాలో వ్యాప్తి చెందుతున్న Omicron JN.1 సబ్-వేరియంట్లు - LF.7, NB.1.8 త్వరగా వ్యాప్తి చెందే వైరస్‌లు. అయితే అంత ప్రమాదకరమైనవి కావు. RT-PCR కిట్లను సిద్ధంగా ఉంచాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించాం. కోవిడ్ లక్షణాలున్నవారు పరీక్ష చేయించుకోవాలి. స్వీయ సంరక్షణ, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి" అని ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

‘మాస్కులు ధరించాలి’..

జలుబు, గొంతు నొప్పి, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మంత్రి కోరారు. "వృద్ధులు, గర్భిణులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాల్లో మాస్క్‌లు ధరించాలి. ఆసుపత్రులలో మాస్క్‌లు తప్పనిసరి. ఆరోగ్య సంరక్షణ కార్మికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. అనవసరంగా ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించాలి. సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం. రోగి చేరిన ఆసుపత్రిలో ప్రోటోకాల్‌ను అనుసరించి చికిత్స అందించాలి. COVID నిర్ధారణ అయిన కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను వేరే చోటికి రెఫర్ చేయడం సరికాదు" అని సూచించారు.

అప్రమత్తమైన తమిళనాడు..

ఇటు తమిళనాడు(Tamil Nadu) ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ సెల్వవినాయగం ది ఫెడరల్‌తో అన్నారు. రాష్ట్రంలో దాదాపు 7.8 కోట్ల జనాభా ఉన్న తమిళనాడులో 10 కేసులు ఆందోళన కలిగించవని చెప్పారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. WHO లేదా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ COVID-19 పై ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ (IHIP) పోర్టల్ ద్వారా కోవిడ్‌తో సహా అన్ని వైరస్‌లను నిశితంగా పరిశీలిస్తున్నామని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆసుపత్రులలో తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

మహారాష్ట్రలో పూర్తి అప్రమత్తత..

మహారాష్ట్ర(Maharashtra)లో 56 కేసులు నమోదు కాగా.. వాటిలో ఎక్కువ భాగం ముంబై నుంచే నమోదయ్యాయని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే బుధవారం విలేఖరులతో అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు. పెరుగుతున్న కోవిడ్ కేసులపై భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Read More
Next Story