‘నీట్’ పై లోక్ సభలో రభస, చర్చ కావాలన్న రాహూల్, సంప్రదాయం కాదన్న..
x

‘నీట్’ పై లోక్ సభలో రభస, చర్చ కావాలన్న రాహూల్, సంప్రదాయం కాదన్న..

నీట్ పేపర్ లీక్ పై లోక్ సభ లో గందరగోళం కొనసాగుతోంది. విపక్షం దీనిపై ప్రత్యేక చర్చ కొనసాగాలని పట్టుబట్టగా, ఇది సభ సంప్రదాయం కాదని ప్రభుత్వ వాదిస్తోంది.


పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం కొనసాగుతోంది. తాజాగా సోమవారం సభ ప్రారంభమైన తరవాత నీట్ పేపర్ లీక్ పై ప్రత్యేక చర్చ చేపట్టాలని విపక్షం కోరింది. పేపర్ లీక్ పై ఒక రోజు ప్రత్యేక చర్చ జరపాలనే డిమాండ్ పై ప్రభుత్వం స్పష్టమైన హమీ ఇవ్వకపోవడంతో విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

లోక్‌సభ సమావేశమైన వెంటనే నీట్‌లో అవకతవకల అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తారు. నీట్‌పై ఒకరోజు చర్చ జరగాలని మేము కోరుతున్నాం. ఇది ముఖ్యమైన అంశం. రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రభావితమయ్యారు. 70 సందర్భాల్లో పేపర్ లీక్‌లు జరిగాయి. మీరు ఈ అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతిస్తే మేము సంతోషిస్తాం" అని రాహుల్ అన్నారు.
ఈ డిమాండ్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో సభ ముగిసే వరకు ప్రత్యేక చర్చ జరగదని అన్నారు. లోక్‌సభ ఉపనేత రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సభకు కొన్ని నియమాలు, విధానాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన సంప్రదాయం ఈ సభకు బలం అని అన్నారు.
"నేను పార్లమెంటేరియన్‌గా ఉన్న దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో, ఈ సమయంలో మరే ఇతర సమస్య ఎప్పుడూ తీసుకోలేదు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఇతర అంశాలను లేవనెత్తవచ్చు" అని సింగ్ చెప్పారు.
ఆయన వ్యాఖ్యలను మరోసారి స్పందించిన రాహుల్, ఇతర ప్రతిపక్ష నాయకులు ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత ఈ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రభుత్వం నుంచి నిర్దిష్ట హామీని కోరారు. నీట్‌ అంశం మనకు చాలా ముఖ్యమైనదని పార్లమెంటు నుంచి విద్యార్థులకు సందేశం పంపగలమని రాహుల్‌ అన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ కలగజేసుకున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మరే ఇతర చర్చను చేపట్టే సంప్రదాయం లేదని, నీట్‌పై చర్చకు సభ్యులు ప్రత్యేకంగా నోటీసు ఇవ్వవచ్చని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్‌ను స్పీకర్ పిలవడంతో విపక్ష సభ్యులు లేచి నిలబడ్డారు. నీట్‌పై ప్రత్యేక చర్చకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వాలని విపక్ష సభ్యులు పట్టుబట్టి వాకౌట్ చేశారు.


Read More
Next Story