
2028లో మళ్లీ కాంగ్రెస్సే..
రెండున్నరేళ్ల సీఎం 'పదవి మార్పిడి' ఫార్ములాపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏమన్నారు?
2028 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్(D K Shiva kumar) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఆయన పార్టీ పెద్దలను కలిశారు. భేటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేసే కార్యకర్తనని, తన నిబద్ధతపై అనుమానం వ్యక్తం చేస్తే వారు భ్రమలో ఉన్నట్టేనని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మార్పు అంశం గురించి మాట్లాడుతూ... తాను పార్టీ అధిష్ఠానం వద్ద ఆ ప్రస్తావనే తేలేదన్నారు. వారి ముందు ఎలాంటి షరతులను పెట్టలేదని కూడా స్పష్టం చేశారు. "నాకు అలాంటి అవసరమూ లేదు. నాకు పార్టీ ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లే కార్యకర్తను. షరతులు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం నా స్వభావం కాదు." అని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్.. ముఖ్యమంత్రి పదవిని ఆకాంక్షించారు. 2023 మే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సిద్దరామయ్య(Siddaramaiah), శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు కాంగ్రెస్ పార్టీ శివకుమార్ను ఒప్పించి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పుట్లో రెండున్నరేళ్ల 'పదవి మార్పిడి' ఫార్ములాపై ఒప్పందం కుదిరినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంపై పార్టీ (Congress) అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.