భారత్ ‘హిందూ దేశం’ కాదన్న నోబెల్ గ్రహీత
x

భారత్ ‘హిందూ దేశం’ కాదన్న నోబెల్ గ్రహీత

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు భారత్ హిందూ దేశం కాదనే నిరూపించాయని ఆర్థికవేత్త అమర్త్యసేన్ అన్నారు. రామమందిరం నిర్మించినప్పటికీ ఫైజాబాద్ ఎంపీ సీట్ ను కోల్పోయిందని..


సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, భారత్ హిందూదేశం కాదనే నిజాన్నినిరూపించిందని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన బెంగాలీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. "భారతదేశం హిందూ దేశం కాదనేది ఎన్నికల ఫలితాల్లో నిరూపించింది" అని సేన్ అన్నారు. 90 ఏళ్ల ఆర్థికవేత్త బుధవారం (జూన్ 26) సాయంత్రం అమెరికా నుంచి కోల్‌కతా చేరుకున్నారు.

'విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టడం ఆపాలి'
బ్రిటీష్ హయాం నుంచి దేశంలో ప్రజలను "విచారణ లేకుండా" కటకటాల వెనక్కి నెట్టడం కొనసాగుతోందని, కాంగ్రెస్ పాలనతో పోల్చితే బిజెపి ప్రభుత్వ హయాంలో ఇది మరింత ఎక్కువగా ఉందని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. "ప్రతి ఎన్నికల తర్వాత మార్పును చూడాలని నేను ఎల్లప్పుడూ ఆశిస్తున్నానని అన్నారు.
ఇంతకుముందు (బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ హయాంలో) ప్రజలను విచారణ లేకుండా కటకటాల వెనక్కి నెట్టడం, పేదలు, ధనికులు మధ్య అంతరాన్ని పెంచే కార్యక్రమాలు కొనసాగాయని, వాటికి ఇప్పుడు బహూశా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని అన్నారు. తన చిన్నతనంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, ఎటువంటి విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టారని సేన్ గుర్తు చేసుకున్నారు.
“నేను చిన్నతనంలో, మా అమ్మానాన్నలు, కజిన్‌లలో చాలామంది విచారణ లేకుండా జైలులో ఉన్నారు. అయితే భారత్ దీని నుంచి విముక్తి పొందుతుందని మేము ఆశించాము. కానీ కాంగ్రెస్ పాలనలోనూ ఇది కొనసాగిందని, వారు కూడా దీనిని మార్చడానికి ఇష్టపడలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇది మరింత స్పీడ్ అయిందని అన్నారు.
దేశంలో లౌకిక రాజ్యంగం ఉందని, ఇలాంటి సమయంలో రాజకీయాలపై ఒపెన్ మైండెడ్ గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే ఆలోచన సరైనదని నేను భావించడం లేదని సేన్ అన్నారు.
కొత్త కేంద్ర కేబినెట్ 'పాత కాపీ'
కొత్త కేంద్ర మంత్రివర్గం " పాత కేబినెట్ కాపీ" అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. “మంత్రులు వారి శాఖలే తీసుకున్నారు. కొంచెం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ, రాజకీయంగా-బలవంతులు ఇప్పటికీ శక్తివంతంగా ఉన్నారు, ” అని ఆయన అన్నారు.
దేశం నిజమైన గుర్తింపు..
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించినప్పటికీ, ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ ఓడిపోవడంపై సేన్ మాట్లాడుతూ, దేశం నిజమైన గుర్తింపును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. 'ఇంత డబ్బు వెచ్చించి రామమందిరాన్ని నిర్మించడం.. దేశాన్ని 'హిందూ దేశంగా’ చిత్రీకరించడం మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌లు జన్మించిన దేశంలో జరగాల్సింది కాదు. ఇది భారతదేశ నిజమైన గుర్తింపును విస్మరించే ప్రయత్నాన్ని చూపిస్తుంది. అది మారాలి," అని అతను చెప్పాడు.
భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సేన్ విమర్శలు గుప్పించారు.



Read More
Next Story